
ఒంగోలు, మే 3,
ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పలువురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయనే టాక్ వనిపిస్తోంది. ఈ కేసులో ఇద్దరు, ముగ్గుర్ని ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరు పోలీసుల అదుపులో ఉండగా.. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితలుకు సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. ముప్పవరపు వీరయ్య చౌదరికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఒంగోలుకు చెందిన యువకుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.వీరయ్యచౌదరి హత్యకేసులో ఒంగోలుకు చెందిన యువకుడు ఎందుకు భాగస్వామి అయ్యాడనే చర్చ సాగుతోంది. ఆ యువకుడే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వీరయ్య చౌదరిని చంపిన వారికి నేర చరిత్ర ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ హత్య కోసం ఒంగోలుకు చెందిన యువకుడు ఒకరితో మరొకరికి పరిచయం లేని వారిని ఎంపిక చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరికి సంబంధించిన వివరాలు చెప్పకుండానే.. నేరుగా హత్యకు హత్యకు ఉసిగొల్పినట్లు ప్రచారం జరుగుతోంది. వీరయ్య చౌదరి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒంగోలుకు చెందిన యువకుడు ముందు డ్రైవింగ్ చేసేవాడు.. ఆ తర్వాత సొంత వ్యాపారం ప్రారంభించాడు. అతడు ఇసుక రవాణా కూడా చేసేవాడని తెలుస్తోంది.ఒంగోలు యువకుడికి వీరయ్య రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరి (ఓ నేత)తో పరిచయాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నేత ఆ యువకుడ్ని బావా అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉందని.. గతంలో కొంతకాలం ఇద్దరు కలిసి ఇసుక రవాణా చేసినట్లు తెలుస్తోంది. బావా అని పిలిచే సాన్నిహిత్యం ఉండటంతోనే ఒంగోలు యువకుడు బావ కళ్లలో ఆనందం కోసం ఈ హత్యకు ప్లాన్ చేశాడా అనే చర్చ జరుగుతోంది. లేని పక్షంలో డబ్బుల కోసమే చేశాడా అన్నది వివరాలు తెలియాల్సి ఉంది. ఒంగోలు యువకుడు దొరికితే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందంటున్నారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారికి నేర చరిత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముప్పవరపు వీరయ్య చౌదరిని అత్యంత దారుణంగా హతమార్చారు.. ఏకంగా 53 కత్తిపోట్లు పొడిచారు, కేవలం నాలుగు నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. వీరయ్యను చంపే క్రమంలో ఓ నిందితుడి చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. ఆ గాయాల నుంచి కారిన రక్తమే ఇటీవల దొరికిన స్కూటీపై పడినట్లు తెలుస్తోంది. అయినా సరే ఆ స్కూటీపైనే నిందితులు పారిపోయినట్లు చెబుతున్నారు. ఈ హత్య చేసినవాళ్లలో నెల్లూరుకు చెందినవాళ్లు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. వీరికి గతంలో కొన్ని హత్య కేసుల్లో ప్రమేయం ఉందంటున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఈ హత్యకేసు విచారణను మరింత వేగవంతం చేశారు.. ప్రస్తుతం వారి అదుపులో ఉన్న అనుమానితులు ఈ హత్య చేశారా?.. వేరేవారి హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులపై అనుమానాలు మాత్రమే ఉన్నాయి.. వారి పాత్ర గురించి ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వారు అధికారికంగా ప్రకటించేవరకు.. అదుపులో ఉన్నవాళ్లు కేవలం అనుమానితులు మాత్రమే.. పోలీసులు చెప్పే వరకు ఈ హత్య ఎవరు చేశారన్నది తేలదు.