
కడప, మే 5,
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడును కడప జిల్లా కేంద్రంలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్రా, దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు కడపకు వెళ్లి.. పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.కడప సమీపంలోని సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బాపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్ఠానం అనుమతితో.. మహానాడు కోసం ఎంపిక చేశారు.మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్కు స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని నేతలు చెబుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ద్వారా భూముల యాజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు.శాటిలైట్ మ్యాప్ ద్వారా మహానాడుకు అవసరమైన స్థలాల వివరాలను.. నేతలకు కమలాపురం ఎమ్మెల్యే వివరించారు. మరింత స్థలం అవసరమైనా రైతుల అనుమతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.మహానాడు 2025కు సంబంధించి ఈ నెల 7న పనులకు భూమిపూజ నిర్వహించి, వేగంగా పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు.పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి, యువతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ మహానాడు వేదికగా మారే అవకాశం ఉంది. పార్టీలో యువ నాయకులకు పెద్ద పదవులు ఇవ్వడం, పార్టీ నిర్మాణంలో మార్పులు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.ఈ వేడుక సందర్భంగా నారా లోకేష్కు పార్టీలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కొత్త తరం నాయకత్వానికి పెద్దపీట వేయాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది.పార్టీ శ్రేణులను ఏకం చేసి.. వారిలో నూతనోత్సాహాన్ని నింపడానికి ఈ మహానాడు దోహదపడుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీ మహానాడులో వంటలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు హాజరయ్యే వేలాది మంది కార్యకర్తలకు రుచికరమైన, సాంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ప్రతి సంవత్సరం, మహానాడులో వంటల ప్రత్యేకతలు మారుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలకు మహానాడులో ప్రాధాన్యత ఇస్తారు. పులిహోర, దద్దోజనం, పొంగలి, సాంబారు, రసం, కూరలు, పప్పు, పెరుగు, మజ్జిగ వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయి. స్థానిక రుచులకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తారు.