
కర్నూలు, మే 5,
రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. దాని పర్యవసానాలను 2024 ఎన్నికల్లో అనుభవించింది. అయినా సరే అమరావతి రాజధాని విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపుతోంది. మరో కొత్త ప్రచారానికి తెరలేపింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అత్యంత వేడుకగా ఈ కార్యక్రమం కొనసాగింది. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధించింది. కూటమి ప్రభుత్వానికి ఎనలేని ఖ్యాతిని తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మూడేళ్లలో ప్రజా రాజధానిని చంద్రబాబు నిర్మించి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కూడా అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆశిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రచారానికి దిగుతోంది.అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం పంపింది ప్రభుత్వం. కానీ కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ఆపై గతం మాదిరిగా అమరావతి టెండర్ల పైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా సైతం ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం భారీగా అప్పులు చేసి అమరావతికి ఆ మొత్తాన్ని పరిమితం చేస్తోందని ఆరోపిస్తోంది. ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని.. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయని గుర్తుచేస్తోంది. పాలనా వికేంద్రీకరణ అన్నది లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా దీనిపైనే పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది.మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. అప్పులు చేసి అమరావతికి పెట్టడం దారుణమన్నారు. ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టడమేనని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణానది ముంపు ప్రమాదం ఉందని చెప్పారు. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ.1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తారని ప్రశ్నించారు. వాటిని నిర్మించకపోతే అమరావతికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో జాతీయ రహదారులకు కిలోమీటర్ కు 20 కోట్లు ఖర్చు పెడుతుంటే.అమరావతిలో 59 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు సాకే శైలజానాథ్. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులఅంశాన్ని తెరపైకి తెచ్చింది. అది వర్కౌట్ కాలేదు. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదని భావించింది. కానీ 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో సీన్ మారింది. మళ్లీ అమరావతికి కొత్త కళ ప్రారంభం అయ్యింది. అంగరంగ వైభవంగా అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవం చేసుకుంది. అయితే ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి దక్కకూడదని ఇప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది వైయస్సార్ కాంగ్రెస్. ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తోంది. మరి అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.