
తిరుమల, మే 10,
శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్న వధూవరులకు శుభవార్త. శ్రీవారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వధూవరులకు ఉచితంగా వివాహాలను జరిపిస్తుంది. తిరుమల పాప వినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో వివాహాలు జరిపిస్తున్నామని టీటీడీ తెలిపింది. పురోహితుడు, మంగళవాయిద్యాలతో పాటు పసుపు, కుంకుమ, కంకణాన్ని ఉచితంగా టీటీడీ అధిస్తుంది. అయితే, వివాహానికి కావాల్సిన సామాగ్రిని వధూవరులే తీసుకెళ్లాలి. వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి.. వారు రాలేని పక్షంలో సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలని టీటీడీ పేర్కొంది. వివాహం అనంతరం రూ.300 ప్రత్యేక ప్రవేశం ద్వారా వధూవరులతో పాటు ఇరువురి తల్లిదండ్రులను కలిపి మొత్తం ఆరుగురిని ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆరు లడ్డూలను ఉచితంగా కౌంటర్లలో అందిస్తారు. అయితే, వధువుకు 18ఏళ్లు, వరుడికి 21ఏళ్లు నిండి ఉండాలి. ద్వితీయ వివాహాలు, ప్రేమ వివాహాలు నిర్వహించబోమని టీటీడీ పేర్కొంది.
స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఇలా..
వివాహం కోసం ttps://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా స్లాట్ నమోదు చేసుకోవాలి.
వధూవరులు తమ తల్లిదండ్రుల వివరాలతో పాటు ఆధార్ కార్డులను అప్ లోడ్ చేయాలి.
బర్త్ సర్టిఫికెట్ లేదా పదో తరగతి మార్కుల జాబితా/టీసీ జతచేయాలి.
వివాహ తేదీ, సమయాన్ని నిర్ణయించుకుని అప్ లోడ్ చేయాలి. ఆ తరువాత ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది.
ఆ పత్రాన్ని తీసుకొని వివాహ సమయానికి 6 గంటల ముందు తిరుమల కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వివరాలను పరిశీలించుకోవాలి.
కల్యాణ వేదిక వద్ద హిందూ వివాహ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వధూవరుల వయసు ధ్రువపత్రాలు, నివాస ధ్రువ పత్రం, పెళ్లి ఫొటో, పెళ్లి పత్రిక, కల్యాణ మండపం రశీదుతో పాటు అవివాహితులగా ఉన్నట్లు స్థానిక తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
ఇతర వివరాలకు 0877-2263433 నంబర్ ను సంప్రదించవచ్చు.2016 నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద టీటీడీ ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 26,214 వివాహాలు జరిపించినట్లు టీటీడీ తెలిపింది.