
విజయవాడ, జూన్ 4,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొందరపడుతున్నారా? కూటమి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. జగన్ ఎన్నికలు పూర్తయి ఏడాది గడవక ముందే ఉద్యమాలు, పోరాటాలు అంటూ దిగడం, ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నివ్వడం పట్ల కొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇంత త్వరగా ఆందోళనలు చేపట్టి రోడ్డు మీదకు వెళితే జనం నుంచి రెస్పాన్స్ వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంత తొందరెందుకు? కనీసం రెండేళ్ల పాటు అయినా ప్రభుత్వానికి కనీసం కొంత వెసులుబాటు ఇచ్చి ఉంటే అది అడ్వాంటేజీగా వైసీపీకి మారేదని అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. జగన్ నేరుగా రోడ్డు మీదకు రాకపోయినప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆరు నెలలు మాత్రం మౌనంగా ఉన్నారు. తర్వాత అనేక పథకాలను అమలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో పాటు రైతులకు పెట్టుబడి సాయం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వంటి అనేక అంశాలపై ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలను అందించారు. అయితే దాని వల్ల ఉపయోగం ఏం కనిపించ లేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల నుంచి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలను నిర్వహించినా వెళ్లిపోవడం ఆగడం లేదు. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. పొరుగున ఉన్న తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడం లేదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా పోరాటాలు, ఉద్యమాలంటూ హంగామా చేయడం లేదు. ప్రజలకు ఎవరేంటో తెలుసుకునే కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ తన సన్నిహితులతో అన్నారు. ఏప్రిల్ నెలలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మినహాయించి ఆయన పెద్దగా ప్రభుత్వం పై విమర్శలు చేయడం లేదు. ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత బాగా పెరిగిన తర్వాత బయటకు రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అప్పుడే పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుతుందని కేసీఆర్ నమ్ముతున్నారు. అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కానీ తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని మాత్రం ఆంధ్రపదేశ్ లో జగన్ అమలు చేయలేకపోతున్నారు. ఎన్నికలు త్వరగా వస్తాయని తొందరపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, అందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టాలని జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. వెన్నుపోటు దినం సరే.... నీకు వెన్నుపోటు పొడిచి వెళ్లేవారి సంగతిని గురించి పట్టించుకోకుండా, అందుకు గల కారణాలు తెలిసినా మార్పులు చేయకుండా ఉంటే ఏ కార్యక్రమం చేపట్టి ఏం లాభమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగన్ తొందరపడుతూ నేతలను కూడా కంగారు పెడుతున్నట్లే కనిపిస్తుంది. రిజల్ట్ మాత్రం నిల్ అని చెప్పక తప్పదు.