
విజయవాడ, జూన్ 5,
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల మధ్య సమన్వయం కొరవడితే నవ్వుల పాలవుతామని, ఒకే అంశంపై మాట్లాడేటప్పుడు అందరూ ఒకే విధంగా మాట్లాడితే ప్రజల్లోకి సరైన పద్ధతిలో వెళుతుందని చంద్రబాబు అన్నారు. అంతే తప్ప ఎవరికి వారు ఒకే అంశంపై వేర్వేరు విధంగా మాట్లాడితే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత పెంచుకునే అవకాశముందని చెప్పారు. అందుకే మాట్లాడే ముందు మంత్రులు సబ్జెక్ట్ పై అవగాహనకు వచ్చి మాట్లాడాలని, సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా మంత్రులందరూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారుకొందరు మంత్రుల పనితీరును... అయితే మంత్రులు ఇంకా పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం శాఖపరమైన విషయాలు మాత్రమే కాకుండా పార్టీ సంబంధిత విషయాలను గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది ఎప్పటికప్పుడు తెలసుకుని తమకు కేటాయించిన జిల్లాల్లో పరిస్థితులను తమకు తెలియజేయాలని కోరారు. అలాగే కార్యకర్తలకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కూడా చంద్రబాబుఅన్నారు. ఈ ఏడాదిలో అనేక మంది కొత్తగా మంత్రి పదవులు చేపట్టారని, వచ్చేఏడాదికి పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. చాలా మంది మంత్రుల పనితీరు బాగుందని, అయితే కొందరు మాత్రం కొంత తమ వ్యవహారశైలితో పాటు పనితీరులో కూడా మార్పులు చేసుకోవాలని ఆయన అన్నారు... ప్రత్యర్థి పార్టీ నేతల అరెస్ట్ ల గురించి ఆలోచించవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చంద్రబాబు తెలిపారు అది జగన్ అయినా మరొకరయినా ఒకటే న్యాయం ఉంటుందని అన్నారు. నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, సోషల్ మీడియాలో పాటు పత్రికల్లో వచ్చే వార్తలకు కూడా మంత్రులు స్పందించాలని, లేకపోతే అందులో వచ్చే వార్తలు నిజమని ప్రజలు భావించే అవకాశముంటుందని, ఆ ఛాన్స్ ఎవరూ తీసుకోవద్దని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు ముందుండాలని కూడా చంద్రబాబు మంత్రులను ఆదేశించారు.
ఏడాది పాలనపై బాగుందనే ఫీలింగ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఏడాది మాత్రమే కావడంతో ప్రజలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అదే సమయంలో జగన్ ఐదేళ్ల పాలనతో బేరీజు వేసుకుని చూస్తే ఇటు పరవాలేదని చెప్పలేని పరిస్థితి. అటు బాగా లేదని అనలేని స్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరి మనసులో అభివృద్ధి జరగాలని ఆశిస్తారు. అదే సమయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉండాలని భావిస్తారు. అయితే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అంచనాలు, ఆలోచనలు అందుకోలేకపోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.. రోడ్లు బాగుండాలని కోరుకుంటారు. పరిశ్రమలు రావాలని అనుకుంటారు. పది మందికి ఉపాధి అవకాశాలు దక్కాలని ఆశిస్తారు. నిరుద్యోగ సమస్య లేకుండా తక్కువ ధరలకు నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సహజంగా కోరుకుంటారు. ఈ విషయాల్లో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులే పడతాయి. ఎందుకంటే వచ్చిన వెంటనే రహదారులను మరమ్మతులు చేశారు. పరిశ్రమలు కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగయితాయన్న భావన ప్రజల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండటంతో నిధులు సమకూరడంతో పాటు పరిశ్రమలు కూడా త్వరగానే వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. అయితే మిగిలిన తొమ్మిది నెలల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుంటే పరవాలేదని పించేలా ఉందని ప్రజలు అంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలపై మాతరం పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచడం ఒకే. అదే సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అందచేస్తున్నారు. అంతకు మించి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సంబంధించిన పథకాలను గ్రౌండ్ చేయలేకపోవడంతో ఒకింత ఆ వర్గం ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. జగన్ హయాంలో తమ బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉండేవని, కానీ కూటమి సర్కార్ ఏర్పాటయిన ఏడాదిలో అకౌంట్ లోకి పైసా పడకపోవడంపై ఒకింత అసంతృప్తి కనిపిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, వరసగా అన్ని పథకాలను అమలు చేస్తామని, ఇచ్చిన హామీలతో క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం ఒకింత ఊరటనిచ్చే అంశమే. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అందచేయనున్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేస్తామని చెప్పడం ఒకింత ప్రజల్లో అసహనంకలుగుతుంది. రెండు నుంచి మూడు వేలు వస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తుండటంతో రానున్న కాలంలో ఈ ఒపీనియన్ లో మార్పు వచ్చే అవకాశముందన్న భావనలో టీడీపీ నేతలున్నారు.