YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దారి మళ్లుతున్న రేషన్ బియ్యం

దారి మళ్లుతున్న రేషన్ బియ్యం

కాకినాడ, జూన్ 5, 
రేషన్ సరకులు పక్కదారి పట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రేషన్ షాపుల్లోనే నేరుగా రేషన్ ఇస్తోంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ బియ్యం వద్దు అన్న వాళ్లకు నిత్యవసర సరకులు ఇచ్చేందుకు సిద్దమైంది. ఇలా చేయడం వల్ల బియ్యం పక్కదారి పట్టకుండా చూడొచ్చని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం నుంచి రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న విషయం తెలిసిందే. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా చట్టాల్లోని లోపాలని వినియోగించుకొని కేటుగాళ్లు తప్పించుకుంటున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం వల్ల ఇలాంటి దందా విపరీతంగా పెరిగిపోయిందని ప్రభుత్వం షాపుల ద్వారా పంపిణీ చేపట్టింది. కానీ ఇలా పంపిణీ చేపట్టిన తొలి రోజే భారీ సంఖ్య రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం మాఫీ వెనుకాల ఉన్న వారి ఎత్తులు ఒక రకంగా ఉంటే... రేషన్ బియ్యం అవసరం లేని వాళ్లు వాటిని అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ మధ్య వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడిన శాసనసభా కమిటీ కీలక సూచనలు చేసింది. ఆరోగ్యశ్రీ తోపాటు ఇతర ప్రభుత్వ పథకాల కోసం కొందరు రేషన్ కార్డు తీసుకుంటున్నారని తేలింది. అలాంటి వారికి రేషన్ అవసరం లేదని అందుకే వారు ఆ రేషన్ తీసుకొని అమ్మేయడమో లేదా రేషన్ డీలర్‌కు వదిలేయడంతో వాళ్లు అమ్ముకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికెట్టేందుకు కేవలం ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డు తీసుకుంటున్న వారికి వేరే కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. ఆరోగ్య శ్రీకు వేరుగా కార్డు ఇస్తే వాళ్లకు రేషన్ కార్డు కట్ చేయవచ్చని తెలిపారు. ఫలితంగా రేషన్ పక్కదారి పట్టే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. వారి సూచనలు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నేరుగా రేషన్ కార్డు కట్ చేస్తే వ్యతిరేకత వస్తుందని ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తోంది. అలాంటి వారందరి నుంచి ముందే సమాచారం సేకరించి వారికి నిత్యవసర సరకులు ఇవ్వబోతున్నారు. బియ్యంం వద్దంటే వారికి కందిపప్పు, నూనెతోపాటు ఇతర సరకులు ఇస్తారు. దీని వల్ల ప్రభుత్వంపై భారం పడినప్పటికీ అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు. నలుగురు ఉండే కుటుంబంపై ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతుంది. అదే ఖర్చు నిత్యవసరాలు ఇవ్వగలిగితే వారికి కూడా మేలు జరుగుతుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అభిప్రాయసేకరణ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయనున్నారు. భవిష్యత్‌లో సన్నబియ్యం కూడా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టుంది. అప్పుడు మాఫియా మరింత రెచ్చిపోతుందని ఇప్పటి నుంచే దాన్ని కట్టడి చేయాలనే ఆలోచన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక్కడ రేషన్ బియ్యాన్ని బ్లాక్‌లో కొంటున్న వాళ్లంతా వాటిని పాలీష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసుకున్నారు.

Related Posts