YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తొక్కిసలాటల్లో 189 మంది మృతి

తొక్కిసలాటల్లో 189 మంది మృతి

హైదరాబాద్, జూన్ 5, 
దేశంలో గత ఏడాది కాలంలో పలు తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషాధ ఘటనల్లో ఇప్పటివరకు 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వందల మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటిదాకా 11 మంది మృతి చెందారు. గతేడాది ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దగ్గరి నుంచి తాజా ఘటన వరకు ఏమేం ఘటనలు జరిగాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవాలని దేశవ్యాప్తంగా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఫ్యాన్స్ ఆశలు నెరవేరుస్తూ.. మంగళవారం ఆర్సీబీ పంజాబ్‌పై జయభేరి మోగించి.. కప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ జట్టుకు బెంగళూరులో ఘన సన్మానం చేశారు. అయితే ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే దేశంలో గత ఏడాది కాలంగా జరిగిన 6 తొక్కిసలాట ఘటనల్లో 182 మంది మృతి చెందారు. మరికొన్ని వందల మంది గాయాల పాలయ్యారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 18 మంది, మహా కుంభమేళాలో 30 మంది, గోవా ఆలయంలో ఆరుగురు, తిరుపతిలో ఆరుగురు, హైదరాబాద్‌ సంధ్యా థియేటర్ వద్ద ఒకరు, హత్రాస్ సత్సంగ్ 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట
ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన దేశ రాజధానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాకు వెళ్లేందుకు రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా గందరగోళానికి గురై పరుగులు తీయడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారాలను కలిపే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై కొంతమంది ప్రయాణికులు జారిపడటంతో ఈ విషాదం జరిగింది. రైలు బయలుదేరడంలో ఆలస్యం, ప్రతి గంటకు 1500 జనరల్ టికెట్ల విక్రయించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రైలు ప్లాట్‌ఫారాలు మారినట్లు తప్పుడు ప్రకటనలు రావడం ప్రయాణికుల్లో గందరగోళం సృష్టించడంతో.. అది ఈ తొక్కిసలాటకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట
144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా అమృత్ స్నానం చేసేందుకు కోట్లాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
గోవా ఆలయంలో తొక్కిసలాట
ఉత్తర గోవాలోని షిర్‌గావ్‌లో జరిగిన వార్షిక లైరై దేవి జాతర (ఊరేగింపు)లో తొక్కిసలాట జరగడంతో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని పనాజి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ దేవి లైరై ఆలయం వద్ద ఈ వార్షిక ఉత్సవం నిర్వహించగా.. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక రద్దీ, సరిపడా భద్రతా బలగాలు లేకపోవడం గందరగోళానికి దారితీసి తొక్కిసలాటకు కారణమైందని వార్తలు వెలువడ్డాయి.
తిరుపతి తొక్కిసలాట
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద వైకుంఠ ద్వార సర్వదర్శనం, భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. 10 రోజుల పండుగ కోసం దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా.. అర్ధరాత్రి నుంచే కౌంటర్ల వద్ద వేలాది మంది భక్తులు చేరుకున్నారు. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం చెలరేగడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. క్యూ లైన్లలో ఉన్న ఒక మహిళకు ఆరోగ్యం బాగోలేదని సహాయం చేయడానికి గేటు తెరవగా.. భక్తుల గుంపు మొత్తం ఒకేసారి ముందుకు దూసుకురావడంతో గందరగోళం చెలరేగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట
గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్యా థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్ద గుమిగూడటంతో మెయిన్ గేటు విరికిగిపోయింది. ప్రేక్షకులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె 9 ఏళ్ల కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడ్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ఇటీవలె డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.
హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట
గతేడాది జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఉన్న భోలే బాబా అని పిలువబడే నారాయణ్ సాకర్ హరి సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట పైన చెప్పిన అన్ని ఘటనల కంటే చాలా పెద్దది. ఈ సత్సంగ్‌లో భారీగా భక్తులు గుమిగూడినపుడు తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో తొక్కిసలాట జరగ్గా.. అక్కడ 121 మంది మరణించారు. సత్సంగ్ నిర్వాహకులు 80 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా.. అంచనాలకు మించి ఏకంగా 2.5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
సింహాచలంతొక్కిసలాట
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. తెల్లవారుజామున సింహాచలంలో 3:30 గంటలకు ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కురిసింది.దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ద ఇటీవల నిర్మించిన గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు భారీ ఈదురుగాలుల ధాటికి రేకులు, ఐరన్ పైపులు పడడంతో గోడ కూలిపోయింది. మహిళ ఆర్తనాదాలతో ఆలయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.

Related Posts