
విజయవాడ, జూన్ 6
జగన్మోహన్ రెడ్డి కెసిఆర్ ను ఫాలో అవుతున్నారా? ఆయన సలహాలతోనే రాజకీయం చేస్తున్నారా? ఆయన మాదిరిగానే ఇంట్లో ఉండి క్యాడర్ తో ఆందోళనలు చేయిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం ఎంచక్కా బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం కేసీఆర్ ఇదే ఫార్ములాను అనుసరించారు. క్యాడర్ను, తెలంగాణ ప్రజలను ఉద్యమంలోకి దించి తాను మాత్రం ఫామ్ హౌస్ లో ఉండి పోయేవారు. ఇప్పుడు జగన్ పరిస్థితి అలానే ఉంది. అధికారపక్షంపై పోరాటం చేయాలని క్యాడర్ ను పురమాయించి.. ఆయన మాత్రం బెంగళూరు వెళ్ళిపోయారు. వెన్నుపోటు హైలెట్స్ తో సాయంత్రం తీరిగ్గా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. వెన్నుపోటు గ్రాండ్ సక్సెస్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది అచ్చం కెసిఆర్ స్ట్రాటజీ మాదిరిగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ ఏదైనా ప్లాన్ చేశారంటే అది పక్కాగా ఉంటుంది. ఇటువంటి ఆందోళనలు జరిపినప్పుడు తాను మాత్రమే ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. తానే స్వయంగా చేయాలనే స్వభావం ఆయనది. సెల్ఫ్ ప్రొజెక్షన్ కోసం జగన్ ఎక్కువగా పరితపిస్తుంటారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు దీక్ష, నిరుద్యోగుల దీక్ష వంటివి చేపట్టినప్పుడు ఇటువంటి దృశ్యాలే కనిపించేవి. పాదయాత్ర తో పాటు ఓదార్పు యాత్ర సమయంలో ఫోకస్ అంత తన చుట్టూనే ఉండేలా జాగ్రత్త పడేవారు. కానీ నిన్న జరిగిన వెన్నుపోటు దినంలో మాత్రం అంత డిఫరెంట్ గా కనిపిస్తోంది. కెసిఆర్ మార్కు పాలిటిక్స్ అంటూ తేడా చూసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇలానే చేసేవారు. తాను ఇంట్లో కూర్చుని నేతలతో పాటు క్యాడర్ కు టాస్కులు ఇచ్చేవారు. తెలంగాణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసిఆర్ కు సహకరించాయి. ఏపీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సాయం అందించారు కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ రోజున నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదకు ఏపీ పోలీసులకు పంపించి.. పరోక్షంగా కెసిఆర్ కు రాజకీయ లబ్ధి చేకూరేలా వ్యవహరించారు జగన్. కానీ ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు మీద కోపంతో జగన్కు బాగా దగ్గరయ్యారు కెసిఆర్. అప్పటినుంచి వారి మధ్య రాజకీయ బంధం కొనసాగుతూనే ఉందిప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డికి సలహాదారులు లేరు. అందుకే కెసిఆర్ సలహాదారుడిగా మారిపోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్తగా, చాణుక్యుడిగా కెసిఆర్ కు పేరు ఉంది. అయితే ఆయన తెలంగాణలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే కనీసం ఏపీలో తన మిత్రుడు జగన్ బలపడితే.. తాను బలపడతాను అన్న రేంజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆపై మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పార్టీని కూడా నడపడానికి తన వద్ద డబ్బులు లేవని తేల్చేశారు. అయితే రాజకీయ సహచరులకు పార్టీలు నడిపేందుకు కేసిఆర్ ఆర్థిక సాయం చేస్తారన్న పేరు ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేతలు తమ రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ను ఆశ్రయిస్తారన్న టాక్ జాతీయస్థాయిలో ఉంది. ఇప్పుడు కూడా ఏపీలో జగన్మోహన్ రెడ్డికి తన విలువైన సలహాలతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. నిన్నటి వెన్నుపోటు దినం లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉంది. దీంతో కెసిఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.