
హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజుల ఒక్కసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినేట్లో సమీక్ష చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. కాగా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.