
హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్ ప్రశ్నలు సంధించింది. కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ సంధించింది. విచారణలో భాగంగా ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు అంటూ ఈటెలను కమిషన్ అడిగింది.
అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానం ఇచ్చారు ఈటెల. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని తెలియజేశారు. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించామన్నారు.
ఈటెలను అడిగిన ప్రశ్నలు ఇవే:
కమిషన్: మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?
ఈటెల: క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాతే నిర్మాణం జరిగింది.
కమిషన్: రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?
ఈటెల: మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాము. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది.
కమిషన్: రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా?
ఈటెల: రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది.
కమిషన్: మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ఎవరిది?
మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా?
ఈటెల: టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చాయి. ఫైనల్గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం కేబినెట్ తీసుకుంది.
కమిషన్: డీఆర్పీ కోసం 597.45 లక్షలు వ్యాప్కోన్ సంస్కు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా?
ఈటెల: తెలీదు
కమిషన్: డీపీఆర్ అప్రూవల్ కేబినెట్లో జరిగిందా?
ఈటెల: అన్ని అనుమతులు కేబినెట్లో తీసుకున్నాం.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు?
ఈటెల: నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్స్ పరిధిలోకి కార్పొరేషన్ రాదు.
కమిషన్: లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు?
ఈటెల: కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపెమంట్ చేయాలని అనుకున్నాం. కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదు.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆఫ్ బడ్జెట్లో జరిగిందా?
ఈటెల: నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు?
ఈటెల: ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్నా టెక్నికల్ టీం చెప్తుంది.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే?
ఈటెల: అదంతా ఫైనాన్స్ శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది అంటూ మాజీ మంత్రి సమాధానాలు ఇచ్చారు.