
ఖమ్మం
ఏదులాపురం మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇండ్లు లేనోళ్లకే ఇస్తామని... ఉన్నోళ్లు ఆశించినా వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి, తెల్దారుపల్లి, పోలేపల్లి ప్రాంతాల్లో బీటీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.... ప్రజలు ఏరికోరి తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏడాదిన్నర పూర్తి కావొస్తుందని తెలిపారు. ఈ ఏడాదిన్నర కాలంలో మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్నబియ్యం ఇలా అనేక సంక్షేమ పధకాలను ప్రజల దరి చేర్చామని పేర్కొన్నారు. ఇంకా అమలు చేయాల్సిన హామీలు కొన్ని ఉన్నాయని వాటన్నింటిని కూడా ఒక్కరోజు ఆలస్యమైనా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే సంక్షేమ పథకాలు ప్రజల దరిచేర్చడంలో కాస్త ఆలస్యమవుతుందని తెలిపారు. తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పేదవాళ్లలో బహుపేదవాళ్లకు ఇవ్వడం జరిగిందన్నారు. రెండు, మూడు, నాలుగు విడతలు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఇప్పుడు ఇళ్లు రాలేదని బాధపడొద్దని రాబోయే విడతల్లో వారికి ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో వచ్చే ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే వారికి ప్రజల ఆశీస్సులు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు.