
హైదరాబాద్, జూన్ 10,
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో పెండింగ్ లిస్ట్లపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మూడు కేబినెట్ బెర్త్లు ఫిల్ చేసిన హస్తం పార్టీ.. దాదాపు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ జాబితా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అసంతృప్తులపై కూడా అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్రెడ్డి..ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో సమాలోచనలు చేయనున్నారు. ప్రభుత్వ పాలన, పథకాల అమలుతో పాటు పార్టీ పరిస్థితులు, సంస్థగత ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు..తెలంగాణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.. 96 మంది నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవులు అప్పగిస్తూ జాబితా రిలీజ్ చేసింది. ఇటీవల టీపీసీసీలో ఐదు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. తాజాగా 27మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69మందికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. కార్యవర్గంలో ఒక ఎంపీతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించింది అధిష్ఠానం. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్యకు స్థానం కల్పించింది. జనరల్ సెక్రెటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్నికారెడ్డి, మట్టా రాగమయికు అవకాశం లభించింది.
టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు కేటాయించారు. వీటిలో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్ట్పై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇక ఇప్పటికే తెలంగాణ కేబినెట్లో మూడు బెర్త్లను ఫిల్చేసిన అధిష్ఠానం వారికి శాఖల కేటాయింపుపై దృష్టిపెట్టింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి..నూతన మంత్రులకు శాఖల కేటాయింపు, ఫోర్ట్ఫోలియోల మార్పులు, అసంతృప్తులపై చర్చలు జరిపారు. ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న పలు కీలక శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశంపై కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు రేవంత్రెడ్డి. గంటపాటు సాగిన ఈ భేటీలో మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రుల దగ్గర ఉన్న శాఖలు, 18 నెలలుగా వారి పనితీరుపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖల సమాచారాన్ని కేసీ వేణుగోపాల్కు అందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర హోం, ఎడ్యుకేషన్, మున్సిపల్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, లా, లేబర్, స్మోర్ట్స్, యువజన శాఖలు ఉన్నాయి. వీటిలో కొత్త వారికి పలు శాఖలు అప్పగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అదే ఫైనల్ అయితే డిప్యూటీ సీఎం మొదలు కీలక మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు.నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్కు లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు ఇవ్వనున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే వాకిటి శ్రీహరికి లా, యూత్, పశుసంవర్థక శాఖలు లేదా మత్స్యశాఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ అప్పగిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మంత్రి పదవి ఆశించి భంగపడిన వారి వివరాలతో పాటు వారిని శాంతింప జేసే అంశాలపై కూడా కేసీతో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. అలాగే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు, కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టాలని సీఎంకు సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్లో అంతర్గత లొల్లి, బీజేపీ-బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందాలను ఎండగడుతూ ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎంకు అధిష్ఠానం నిర్దేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.