
గుంటూరు, జూన్ 11,
వైసీపీలో రాజీనామాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే వెళ్లాల్సిన నేతలు వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యులు నలుగురు వెళ్లిపోగా, శాసనమండలి సభ్యులు మాత్రం ఆరుగురు వరకూ వెళ్లిపోయారు. శాసనసభకు ఎన్నికయిన పదకొండు మందిలోనూ, లోక్ సభకు ఎన్నికైన ముగ్గురిలోనూ ఏ ఒక్కరూ పార్టీని వీడలేదు. వీరంతా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఏదైనా రాజీనామాలు ఉంటే మొదటి ఏడాదిలోనే ఉంటాయి. ఇక ఏడాది సమయం పూర్తి కావడంతో పాటు వైసీపీ కి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఇక రాజీనామాలు దాదాపు ఆగినట్లే అనుకోవాలి. ఒకరకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నుంచి రాజీనామాలు లేవు. అయితే తాజాగా రాజంపేట టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో ఒకింత ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది. అధికార పార్టీకి ఏడాదిలోనే రాజీనామాలు మొదలవ్వడం, వైసీపీకి రాజీనామాలు ఆగిపోవడంతో ఒకింత ఫ్యాన్ పార్టీ అధినేత ఊపిరి పీల్చుకున్నారు. కూటమిలో మూడు పార్టీల నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు నియోజకవర్గాల్లో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండటంతో లోకల్ గా ఉండే వైసీపీ నేతలు కూడా తమ ఆలోచనను మార్చుకున్నారని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ అవసరమైతే కూటమిలోని ఏ పార్టీలోనైనా చేరేందుకు సిద్ధమయ్యేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనను మార్చుకున్నారు. వీడిన నేతలు... పైగా గత ఎన్నికలకు సమయంలో టిక్కెట్లు రాని కొందరు పార్టీని వీడి కొందరు వెళ్లిపోయారు. చివరి నిమిషంలో టిక్కెట్ కోసం కాంగ్రెస్ వంటి పార్టీల్లో చేరి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఓటమి పాలయిన తర్వాత తిరిగి వైసీపీలోకి చేరేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షులతో టచ్ లోకి వెళ్లిన నేతలు జగన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. వచ్చే ఎన్నికలకు తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు ఉన్న ఆర్థిక బలంతో పాటు అనుచరుల బలం, ఓటు బ్యాంకు విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని కొందరు నేతలు జిల్లా స్థాయి నేతలను అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం... అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందకపోవడంతో చేరికలు ఇంకా మొదలు కాలేదని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. జగన్ అన్ని నివేదికలు చూసిన తర్వాత వారిలో కొందరి చేరికలకు అంగీకరించే అవకాశముందని తెలిసింది. ఇందులో రాయలసీమకు చెందిన నేతలు కొందరున్నారని చెబుతున్నారు. ఇక ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా గత ఎన్నికల్లో టిక్కెట్ రాక పార్టీని వీడి వెళ్లిపోయారు. వారిలో కూడా కొందరు తిరిగి వైసీపీ గూటికి చేరుకునే ప్రయత్నం చేస్తుండటం విశేషం. అయితే జగన్ అన్ని రకాలుగా ఆలోచించి, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలిసింది.