
విశాఖపట్టణం, జూన్ 11,
విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని క్రికెట్ అభిమానులకు ఇది పండగలాంటి వార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచకప్ మ్యాచులను వీక్షించే అవకాశం దక్కనుంది. అది కూడా ఒకటీ రెండు కాదు. ఏకంగా ప్రపంచకప్ మ్యాచ్లను ఐదింటిని చూసే అవకాశం దక్కింది. త్వరలోనే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 జరగనున్న సంగతి తెలిసిందే. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ల కోసం ఐసీసీ ఇటీవల వేదికలను ఖరారు చేసింది. అందులో విశాఖపట్నం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మహిళల ప్రపంచకప్కు సంబంధించి ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) వెల్లడించారు.ఐదు ప్రపంచకప్ మ్యాచ్లతో పాటుగా ఒక వన్డే మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కేశినేని చిన్ని వివరించారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్లు నిర్మించేందుకు ఏసీఏ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా కర్నూలు, నెల్లూరులో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అలాగే త్వరలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం ఏసీఏ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు.45 రోజుల్లోనే విశాఖపట్నం స్టేడియాన్ని ఆధునీకరించామని.. ఈ ఏడాదిలో రెండు ఐపీఎల్ మ్యాచ్లను కూడా నిర్వహించినట్లు కేశినేని శివనాథ్ గుర్తు చేశారు. స్టేడియం అప్గ్రేడ్ మీద బీసీసీఐ, ఐసీసీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దీంతోనే విశాఖపట్నంలో మహిళల ప్రపంచకప్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ నుంచి అనుమతి వచ్చినట్లు తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వాన్ని 65 ఎకరాల భూమిని కోరినట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లా క్రికెట్ సంఘాలకు అందించే గ్రాంటును కూడా 20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వివరించారు.