
తిరుపతి, జూన్ 16,
ప్రజల సెంటిమెంట్ పై కొడితే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించారు. తాము భక్తితో కొలిచే ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేయగా ఓ టిడిపి నేతతో పాటు ఆయన అనుచరులను గ్రామస్తులు చితక్కొట్టారు. వెంటాడి, వెంబడించి మరి దాడి చేశారు. చివరకు పోలీసులు వచ్చి వారిని రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. భూ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం నడుస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి.తిరుపతి రూరల్(మండలం దామినేడులో ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. దీనిపై స్థానిక టిడిపి నేత కృష్ణమూర్తి నాయుడు కు గ్రామస్తులతో పంచాయితీ నడుస్తున్నట్లు సమాచారం. అయితే కృష్ణమూర్తి నాయుడు తో పాటు ఆయన అనుచరులు ఒక్కసారిగా వచ్చి ఆ స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణమూర్తి వర్గం తిరగబడడంతో ఒక్కసారిగా గ్రామస్తులు సైతం మూకుమ్మడి దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామస్తులను అడ్డుకున్నారు. కృష్ణమూర్తి నాయుడుతో పాటు ఆయన అనుచరులను తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొద్దిరోజులుగా ఈ స్థలం వివాదం నలుగుతోంది. ఈ తరుణంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.మరోవైపు ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం కూటమి హయాంలో జరుగుతున్న అరాచకం అంటూ ఈ వీడియోను సర్క్యూలేట్ చేస్తోంది. దీంతో ఇది వైరల్ అంశం గా మారిపోయింది. అయితే టిడిపి శ్రేణులు దీనిని తప్పుపడుతున్నాయి. భూ వివాదాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నాయి. కాగా టిడిపి నేతల ఆదేశాలతో కృష్ణమూర్తి నాయుడుతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.