
నెల్లూరు, జూన్ 16,
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే సూపర్ సిక్స్లో ప్రకటించిన పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి.. అర్హుల ఖాతాలో నిధులు జమ చేసింది. ఈపథకం కింద కుటుంబంలో ఎంత మంది అర్హులుంటే వారందరికి తల్లికి వందనం అమలు చేసింది. స్కూళ్లు తెరిచిన రోజున అనగా జూన్ 12నే దీన్ని ప్రారంభించగా.. సాంకేతిక కారణాల వల్ల ఒక్క రోజు ఆలస్యమైంది. దాదాపుగా లబ్ధిదారులందరి ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ అయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి తల్లికి వందనం పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో రంగులు, బొమ్మల పిచ్చితో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని గొట్టిపాటి రవి ఆరోపించారు. కానీ కూటమి ప్రబుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు, టీచర్ల నియామకంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే స్టూడెంట్స్కి మధ్యాహ్న భోజనంలో భాగంగా సన్నబియ్యం వడ్డించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీనిపై విద్యార్థులు,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం.. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్,కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.13 వేలు అందిస్తోంది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికీ రూ.15000 చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. పాఠశాలల అభివృద్ధికి అని చెప్పి.. ఈమొత్తం నుంచి రూ.2000 కట్ చేసి.. రూ.13000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.ఇక అధిక సంతానం ఉన్న వారి ఖాతాల్లో భారీ ఎత్తున డబ్బులు జమ అయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని ఓ కుటుంబానికి తల్లికి వందనం కింద ఏకంగా రూ.1.56 లక్షలు అకౌంట్లలోకి పడ్డాయి. లబ్ధిదారులది ఉమ్మడి కుటుంబం కావడం.. ఫ్యామిలిలో 12 మంది పిల్లలు ఉండటంతో ఇంత భారీ మొత్తంలో నిధులు జమ అయ్యాయి.
ఒకే తల్లికి అంత మంది పిల్లలా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం అమల్లో.. అక్కడక్కడా పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.15000 అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారమే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు ప్రారంభించింది. జూన్ 12వ తేదీ తల్లికి వందనం నిధులు విడుదల చేశారు. జూన్ 13 నుంచి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమవుతోంది. ఈ క్రమంలోనే తమ కుటుంబంలో 12 మందికి తల్లికి వందనం వచ్చిందని, ఐదుగురికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారుఅయితే తల్లికి వందనం పథకం అర్హుల తుది జాబితాలో పలుచోట్ల పొరబాట్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సరిచేసే పనిలో ఉన్నారు. అర్హులైనవారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో చాలా మంది విద్యార్థులకు ఒకటే తల్లి పేరు కనిపిస్తోంది. ప్యాపిలిలో 96 మంది విద్యార్థులకు ఒకటే తల్లి పేరు కనిపిస్తోంది. ఈ రకంగా ఇద్దరి విషయంలో జరిగింది. ప్యాపిలి సచివాలయం-3 పరిధిలో మౌనిక అనే మహిళ పేరును 96 మంది విద్యార్థులకు తల్లిగా చూపించారు. ప్యాపిలి సచివాలయం-4 పరిధిలో శోభ అనే మహిళను కూడా 96 మంది పిల్లలకు తల్లిగా చూపించారు.మరోవైపు తల్లికి వందనం పథకం అమలలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకే తల్లి పేరు మీద 340 పిల్లల పేర్లు తల్లికి వందనం పథకం కోసం నమోదు చేశారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఒకే తల్లి పేరుతో 10 నుంచి 30 మంది వరకూ విద్యార్థుల పేర్లు నమోదు చేశారని.. వీరంతా టీడీపీ కార్యకర్తలేనంటూ పోస్టులు పెడుతున్నారు. తల్లికి వందనం పథకం పేరుతో టీడీపీ కార్యకర్తలకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సమయం తెలుగు పరీక్షించగా.. తల్లికి వందనం పథకం 2025 రికార్డులలో మీరు చేర్చబడలేదంటూ సమాధానం వచ్చింది. దీంతో ఈ పోస్టు తప్పుదోవ పట్టించేదిగా భావించవచ్చు.మరోవైపు వైరల్ ట్వీట్లపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన విద్యార్తులకు సంబంధించిన నగదును ఇప్పటికే వారి తల్లులకు విడుదల చేశామని.. అర్హులై ఉండి, జాబితాలో పేర్లు లేని వారు తమ వివరాలు గ్రామ సచివాలయ శాఖ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.దరఖాస్తుదారుల ఫిర్యాదులను పరిశీలించి, అర్హులైతే వారికి కూడా లబ్థి చేకూర్చుతామని.. తల్లిదండ్రులు లేని పిల్లలకు ‘తల్లికి వందనం’ నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ అకౌంటుకు జమచేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత కలెక్టర్ ద్వారా వారికి కూడా తల్లికి వందనం నగదు అందజేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు కలిగిన తల్లుల జాబితానూ పున:పరిశీలించాక వారికి కూడా తల్లికి వందనం నగదు జమ చేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతామని పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.