
హైదరాబాద్, జూన్ 16,
తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా మంత్రి పొంగులేటి ఎన్నికల షెడ్యూలుపై కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణ తేదీపై స్పష్టత వస్తుందన్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. మంత్రుల వరుస ప్రకటనలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులు, ఆశావహులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలుపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ప్రకటించారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయాని.. ఆ తర్వాత సర్పంచ్ (గ్రామ పంచాయతీ), మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితా తయారీ పనులను పూర్తి చేసిందన్నారు. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను కూడా సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. గత ఏడాదే ఎన్నికలు నిర్వహించాలనుకున్నా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో తమ పట్టును బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల అమలు చేసిన రైతు భరోసా, మహాలక్ష్మి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని చూస్తోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను తమ బలాన్ని తిరిగి నిరూపించుకునే అవకాశంగా చూస్తోంది. గ్రామస్థాయిలో తమ కార్యకర్తలను, నాయకులను క్రియాశీలం చేసేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల విజయం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో తమ ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.మంత్రుల ప్రకటనల నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటీకి సిద్దమవుతున్నారు. గ్రామాల్లో పాగా వేసి ఓటరు దేవుళ్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జూన్ 2025 చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొదటగా MPTC, ZPTC ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జూలై లేదా ఆగస్టు 2025లో ఎన్నికలు జరగవచ్చు. పోలింగ్ కేంద్రాలు, బూత్లు, బ్యాలెట్ బాక్స్ల ఏర్పాటు, మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
రాజకీయ పార్టీల వ్యూహాలు
కాంగ్రెస్: అధికార పార్టీగా, గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, భూభారతి వంటి పథకాలపై దృష్టి సారించింది.
BRS: ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ: రాష్ట్రంలో తమ ఉనికిని పెంచేందుకు ఈ ఎన్నికలను కీలక అవకాశంగా భావిస్తోంది.
రిజర్వేషన్పై చర్చ
బీసీ రిజర్వేషన్ను 42%కి పెంచాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర బీసీ కమిషన్ దీనిపై నివేదిక సిద్ధం చేస్తున్నప్పటికీ, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తం చేశారు. ఈ అంశం ఎన్నికల సన్నాహాల్లో ముఖ్యమైన సవాలుగా మారింది.