
హైదరాబాద్, జూన్ 16,
తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, తిరిగి ఆ కుటుంబంలోని వ్యక్తులకే ఎమ్మెల్యే సీటు కేటాయించడంతోపాటు, మిగతా పార్టీలు కూడా పోటీకి దూరంగా ఉండేవి. కానీ తాజా రాజకీయాల్లో అటువంటి ఆనవాయితీకి చెక్ పెట్టేశాయి ప్రధానపార్టీలు. ఈ క్రమంలో 6 నెలల్లోపే జూబ్లిహల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకునే వ్యూహంతో బీఆర్ఎస్ , ఈసారైనా సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, తామేం తక్కువ కాదంటూ బిజెపి.. ఇలా మూడు పార్టీలు టార్గెట్ జూబ్లీహిల్స్ అంటూ ఇప్పటి నుండే ఎమ్మెల్యే అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి.బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ స్థానంలో తిరిగి బిఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే విజయం సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లిహిల్స్ సీటు వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉంది. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్, ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరడం 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు, ఇన్నాళ్లు పార్టీకి నమ్మిన బంటులా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ కు కేసీఆర్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల గోపీనాథ్ పార్ధీవదేహం వద్ద కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారంటే సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కష్టకాలంలో పార్టీని నమ్ముకోవడంతోపాటు, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా తన విధేయతను చాటుకున్న మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఆసక్తి ఉన్నవారికే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ పోటీకి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ఆసక్తి లేకపోతే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ లో మాగంటి కుటుంబమే బరిలోకి దిగుతుందా, లేక పిజేఆర్ వారసత్వం పోటీ ఇస్తుందా అనే ఆసక్తి నెలకొందిజూబ్లీహిల్స్ నియోజకర్గంపై కాంగ్రెస్ లెక్కలు మరోలా ఉన్నాయి. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ కీలకమైన నియోజకవర్గం కావడంతో ఈసారి హస్తం జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్దిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పోటీచేశారు. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు గట్టి పోటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో మైనారిటి ఓట్లు అభ్యర్దుల గెలుపోటములు ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో ఈసారి బైపోల్ ఎన్నికల్లోనూ అజారుద్దీన్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో అజార్ కు పోటీగా గట్టి లాబియింగ్ జరుగుతోంది. జూబ్లీహిల్స్ బరిలో నేనూ ఉన్నానంటూ పీజేఆర్ కూతరు విజయారెడ్డి సైతం ఇప్పటికే నియోజకవర్గం ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం మొదలుపెట్టారు. ఇలా అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి పుంజుకుంది. అదే జోరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ చూపించాలని కమలం నేతలు భావిస్తున్నారు. 2023 ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్దిగా లంకల దీపక్ రెడ్డి పోటీచేశారు. 25 వేల ఓట్లు సాధించి తామేం తక్కువ కాదంటూ నిరూపించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బంధువైన దీపక్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ బిజెపి డివిజన్ ప్రెసిండెంట్ గా ఎంపికై పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్దిగా తిరిగి దీపక్ రెడ్డిని నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిర్ణయం మారితే మరో ఇద్దరు మహిళా నేతలు బిజెపి నుండి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. గతంలో బిజెపి సీటు కోసం చివరి వరకూ ప్రయత్నం చేసి కీర్తీరెడ్డి, కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ పద్మ కూడా బిజెపి జూబ్లీహిల్స్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బిజెపిలో త్రిముఖ పోటీ హీటు పుట్టిస్తోంది.