
హైదరబాద్, జూన్ 16,
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తారా? ఇతర పార్టీల నుంచి నాయకులు చేరుతారా? ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నేతలు తిరుగు ముఖం పడతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో చంద్రబాబు సంచలన అంశాలు బయటపెట్టారు. తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించనుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆశ కనిపిస్తోంది.
తెలంగాణలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తెలుగుదేశం పార్టీ భర్తీ చేస్తుందని వారంతా ఆశాభావంతో ఉన్నారు.1999 ఎన్నికల వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఉండేది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలమైన ఉనికి చాటుకుంటూ వచ్చింది. టిడిపి ఆవిర్భావం నుంచి ఏపీ కంటే తెలంగాణలోనే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేవి. తెలంగాణలో అణగారిన వర్గాలకు, బీసీలకు ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ వర్గాల నుంచి నాయకత్వాన్ని కూడా తెప్పించింది ఎన్టీఆర్. దీంతో తెలంగాణలో టిడిపి బలమైన ముద్ర చాటుకోవడం వెనుక ఆ నేతల కృషి ఉంది. అయితే ఎప్పుడైతే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం ప్రారంభం అయ్యిందో.. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ క్రమేపి బలహీనపడుతూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ కెసిఆర్ రాజకీయ దెబ్బకు టిడిపి పునాదులతో సహా కదిలిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కలిసి దారుణంగా దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. 2023 ఎన్నికల్లో పూర్తిగా పోటీ చేయలేదు. పక్కా రాజకీయ వ్యూహంతో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించకుండా సైలెంట్ అయింది. అదే కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ కు దారుణంగా దెబ్బతీసింది ఆ నిర్ణయం.తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ కీలక నేతలంతా ఇతర పార్టీల వైపు వెళ్లారు. చివరకు ఇప్పుడు కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సైతం టిడిపిలో యాక్టివ్ గా పని చేసిన వారే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన ఏకంగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయితే టిడిపి క్యాడర్ ఉన్న వారిని సమన్వయ పరిచే నాయకత్వం లేదు. 2023 ఎన్నికలకు ముందు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీకి ఒక ఊపు తెచ్చారు. అయితే ఇంతలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధినేత చంద్రబాబును అవినీతి కేసుల్లో జైల్లో పెట్టింది. ఆ సమయంలో తెలంగాణకు ఎన్నికలు జరగడంతో పార్టీ పోటీ చేయడానికి ముందుకు రాలేదు. ఈ నిర్ణయంతో విభేదించిన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ లో చేరారు. అయితే చంద్రబాబు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో టిడిపి శ్రేణులు.. పరోక్షంగా కాంగ్రెస్ వైపు మళ్లాయి. అక్కడ రేవంత్ రూపంలో ఒకప్పటి టిడిపి నేత కనిపించడంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాయి టిడిపి శ్రేణులు. తద్వారా ఒక్కప్పటి టిడిపి నేత రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. టిడిపిని దారుణంగా దెబ్బతీసిన కేసిఆర్ మాజీ అయ్యారు.అయితే తెలంగాణలో టిడిపి బలోపేతం కావడానికి ఓ మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్కడ టిడిపికి కేడర్ ఉంది. ఆపై బిజెపి సైతం ఉనికి చాటుకుంటూ వస్తోంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. టిడిపికి ఇప్పటికీ గ్రామస్థాయి క్యాడర్ ఉంది. ఒకవేళ బిజెపితో పొత్తు పెట్టుకుంటే.. రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. దీంతో తెలంగాణలో సెటిలర్స్ పై ప్రభావం చూపి.. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలకు ఉన్న బలం పెంచుకుంటే మాత్రం.. 2028 ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రణాళిక సిద్ధమవుతోంది. అందుకే చంద్రబాబు తెలంగాణలో సైతం పార్టీ బలోపేతం చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. చూడాలి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో..