
విజయవాడ, జూన్ 18,
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో ఏపీ నేతల ఫోన్లో కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా సమాచారం అందుతోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసునకు సంబంధించి ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగు కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోన్లను సైతం అప్పట్లో ట్యాపింగ్ చేసినట్లు తెలియడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు కొత్త మలుపునకు దారి తీసినట్లు అయ్యింది. అప్పట్లో కెసిఆర్ తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్నేహం కారణంగానే చంద్రబాబు, లోకేష్ ను అప్పటి తెలంగాణ సర్కార్ టార్గెట్ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగు తెరపైకి వచ్చింది. అప్పట్లో కెసిఆర్ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారని.. అందులో కాంగ్రెస్ తో పాటు బిజెపి నేతలు బాధితులుగా మిగిలారన్న విమర్శలు ఉండేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపగా ఏపీలో టిడిపి నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి కొనుగోలు చేసిన ప్రత్యేక పరికరం ద్వారా వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేవారు. తెలంగాణలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. 2018లో తెలంగాణలో ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని.. అందుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు కేసీఆర్. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహకారం అందించి మరింత దగ్గరయ్యారు. అప్పటినుంచి చంద్రబాబును రాజకీయంగా దెబ్బ కొట్టాలని భావించారు ఇద్దరు నేతలు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందని.. చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా విచారణలో మాజీ ఓఎస్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఆ పనికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం అయితే ఒక్క టీడీపీ నాయకులే కాదు. కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారంలో ఉంది. విచారణలో కూడా ఇదే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఓఎస్డి వాంగ్మూలంతో మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ వుచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగు ప్రకంపనలు ఏపీకి కూడా తాకాయి. మరి ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి.
నా ఫోన్ ట్యాప్ చేశారు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ సంచలనం. గత సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతలు, సినీ నటులుతోపాటు.. తనకు గిట్టని జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్రావు ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు. ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ వైఎస్.షర్మిల బాంబు పేల్చారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల వెనుక ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు బృందం ఉందని, ఈ విషయంలో గోప్యత కోసం కోడ్ భాషను ఉపయోగించినట్లు షర్మిల ఆరోపించారు. తాను ఎవరితో మాట్లాడుతున్నారన్న సమాచారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పటికప్పుడు చేరవేయబడినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలను గుర్తించిన వైఎస్ షర్మిల, తన గోప్యతను కాపాడుకోవడానికి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు బృందం, షర్మిల ఫోన్ సంభాషణలను అత్యంత గోప్యంగా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఈ కార్యకలాపాలను కనుగొన్న షర్మిల, తన సంభాషణలు రహస్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం ఆమె అనుచరుల ద్వారా ఒక పోలీసు అధికారి ద్వారా హెచ్చరికగా తెలిసినట్లు కూడా ఆమె పేర్కొన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాలంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. ప్రభాకర్ రావు నేతృత్వంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) ఈ కార్యకలాపాలకు కేంద్రంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన ప్రభాకర్ రావు, గతంలో అమెరికాకు వెళ్లిపోయి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2025 జూన్ 9న హైదరాబాద్కు తిరిగి వచ్చి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు హాజరయ్యారు.సిట్ విచారణలో ప్రభాకర్ రావు రాజకీయ నిఘా కోసం ప్రత్యేకంగా ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్) విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ విభాగం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖుల ఫోన్లను ‘మావోయిస్టు’ ముసుగులో ట్యాప్ చేసినట్లు ఆయన విచారణలో తెలిపినట్లు వెల్లడైంది. ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు వంటి వారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ప్రభాకర్ రావు ఈ ఆదేశాలను ఖండిస్తూ, ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను చూపించాలని సిట్ అధికారులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది.షర్మిల ఆరోపణల ప్రకారం, తన ఫోన్ సంభాషణల సమాచారం జగన్కు చేరవేయబడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. గతంలో షర్మిల, జగన్పై వైఎస్ ఆస్తులకు సంబంధించి కేసులు, వ్యక్తిగత ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆమె ఆరోపణలకు మరింత బలం చేకూర్చే అంశంగా కనిపిస్తోంది.సిట్ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రభాకర్ రావు సహా ఇతర నిందితుల సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ద్వారా డేటాను రికవరీ చేస్తోంది. ఈ రికవరీ డేటా ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ప్రొఫైల్స్ను రూపొందించి నిఘా పెట్టినట్లు వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావొచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ షర్మిల ఫోన్లపై నిఘా ఆరోపణలు, జగన్కు సమాచారం చేరవేయబడిన అనుమానాలు ఈ కేసుకు కొత్త కోణాన్ని జోడించాయి. సిట్ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు రాజకీయ, చట్టపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.