YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్కడ వానలే..వానలు

అక్కడ వానలే..వానలు

నిజామాబాద్, జూన్ 23, 
మిన్ను కురిస్తేనే మన్ను పండుతుంది. మన్ను పండితేనే నోట్లోకి ఐదు వేళ్ళూ వెళతాయి. లేకుంటే అంతే సంగతులు.. మనదేశమే కాదు.. ప్రపంచం మొత్తం మీదే పరిస్థితి. వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి. పంటలు పండితేనే భూమ్మీద మనిషి మనుగడ కొనసాగుతుంది. వర్షాలు కురువని నాడు.. ఆ పంటలు పండని నాడు.. మనిషి మనుగడ ముగిసిపోతుంది.ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే చివరి వారం లోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడతాయని.. తద్వారా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మే చివరి వారంలో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. అడపాదడప వర్షాలు కూడా కురిసాయి. దీంతో రైతులు దుక్కులు దున్నారు. విత్తనాలు కూడా విత్తారు. సాగు పనులు చేపట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మందు మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేసాయి. ఫలితంగా నిండు వాన కాలంలో రెండో ఎండాకాలం మాదిరిగా సూర్యుడి రెచ్చిపోతున్నాడు. బీభత్సంగా ఎండకాస్తూ జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎండకు తీవ్ర ఉక్కపోత కూడా కారణం కావడంతో పగటిపూట కాదు రాత్రిపూట కూడా ప్రజలు నరకం చూస్తున్నారు. కంటినిండా కునుకు కూడా కరువు కావడంతో ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు లేకపోవడంతో విత్తిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన మొలకలు మాడిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న వనరులతో నీటి తడులు ఇస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులు వాన దేవుడికి పూజలు చేస్తున్నారు. కప్పతల్లి ఆట ఆడుతూ వరుణుడు కరుణించాలని కోరుతున్నారు. వరద పాశం నాకుతూ వర్షాలు కురవాలని దేవుడికి మొక్కుతున్నారు.. తెలంగాణలోని ఓ ప్రాంతంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. రోకలిని ఇద్దరు వ్యక్తులు మోస్తూ.. మధ్యలో ఒక వస్త్రంలో కప్పను కట్టారు. ఆ కప్ప మీద నీళ్లు చల్లుతూ ఊరంతా ప్రదర్శన చేశారు. డప్పులు కొట్టుకుంటూ వర్షాలు కురవాలని పూజలు చేశారు. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూలై మొదటి వారం దాకా వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఋతుపవనాల విస్తరణలో మందగమనం వల్లే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా వాయుగుండం లేదా ఉపరితల ద్రోణి ఏర్పడితేనే పరిస్థితి మెరుగవుతుందని వారు అంటున్నారు. అయితే కప్పతల్లి ఆట ఆడటం వల్ల వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు నమ్ముతారు. వరద పాశం నాకినా కూడా వర్షాలు కురుస్తాయని భావిస్తుంటారు. వర్షాకాలంలో వర్షాలు కురియకపోతే రైతులు ఇలాంటి పనులు చేస్తుంటారు.. అయితే ఇవి చేస్తే వర్షాలు పడతాయని రైతులు భావిస్తుంటే.. వీటికి వర్షాలకు ఏంటి సంబంధం అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. అయినప్పటికీ వారి నమ్మకం ఆధారంగానే రైతులు ముందుకు సాగుతుంటారు.

Related Posts