
గుంటూరు, జూన్ 23,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడిందా? ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడు కూటమి పార్టీలో పెద్దయెత్తున చర్చజరుగుతుంది. కొన్నేళ్లుగా జగన్ పై ఉన్న కేసులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయని, కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని కూటమి పార్టీలో ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీ తనకు అనుకూలంగా ఉంటారన్న ధైర్యంతోనే జగన్ ఉన్నారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిందితులను విచారించి చాలా రోజులయినప్పటికీ ఇప్పటికీ ముందడగు పోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ పురోగతి లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ అధికారులు కూడా దీనిపై పెద్దగా స్పందించడం లేదు. ఇక 2019లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ పురోగతి లేదు. అసలు నిందితులని అనుమానిస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. ఈ ఇప్పటికే ఈ కేసు సీబీఐ విచారణ ప్రారంభించి ఇన్నేళ్లవుతున్నా అంగుళం కదలకపోవడానికి కారణాలపై ముఖ్యంగా టీడీపీ నేతల్లోనే చర్చ మొదలయింది. జగన్ బెంగళూరులో ఉంటున్నప్పటికీ, ఢిల్లీ గడప తొక్కపోయినప్పటికీ అక్కడి వారితో సంబంధాలు బాగానే నెరుపుతున్నారన్న అనుమానాన్ని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా వైసీపీ ఎంపీల జోలికి పోవడం లేదు. ఇద్దరిని మాత్రమే రాజీనామా చేయించగలిగింది. కనీసం జగన్ పై వత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు. నాడు టీడీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులందరూ నలుగురు వెళ్లి బీజేపీలో కలిశారని, నేడు ఏడాది అవుతున్నా కేవలం ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారని, వారిలో ఒకరు తిరిగి బీజేపీలో చేరగా, మరొకరి స్థానంలో బీజేపీ అభ్యర్థినే పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నారంటున్నారు. జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఆర్థికంగా బలవంతులున్నప్పటికీ వారి జోలికి వెళ్లకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో జగన్ ను జీరో చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే సహకరించడం లేదన్న భావన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. . అందుకే జగన్ ధైర్యంగా రాష్ట్రంలో తిరిగగలుగుతున్నారని, ఢిల్లీలో ఉన్న పెద్దలకు జగన్ పట్ల ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టిందన్న అభిప్రాయం పసుపు పార్టీలో పుష్కలంగా కనిపిస్తుంది. తమ చేతికి మట్టి అంటకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల చేత అరెస్ట్ లు చేయించాలని భావించిన తెలుగుదేశం పార్టీ నేతల ఆశలు నిజం కాకపోవడంతో రాను రాను ఇక జగన్ కు క్రేజ్ పెరిగే అవకాశముండటంతో అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా సహకరించే అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ విచారణలు వంటివి తాబేటి నడకలా సాగుతుండటంతో ఈ అనుమనాలు సహజంగానే కలుగుతున్నాయి. మరి నిజమేంటో కానీ.. జగన్ ఏ ధైర్యంతో ఉన్నారన్నది ఆయనకే తెలియాలి.