
ఏలూరు, జూన్ 23,
సినిమాల్లో పవన్ కల్యాణ్ కు తిరుగులేదు. చేసింది తక్కువ సినిమాలయినా చిరంజీవికి మించిన క్రేజ్ వచ్చింది. నిజానికి మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగానే టాలీవుడ్ లోకి కాలుమోపినా తర్వాత పవన్ కల్యాణ్ తనకంటూ లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిఇన్ని దశాబ్దాలు గడిచినా ఇమేజ్ ఇసుమంత కూడా చెక్కు చెదరలేదు. పవన్ కల్యాణ్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్కు పండగే. నిజానికి అభిమానులు దేవుడిగా పవన్ కల్యాణ్ ను కీర్తిస్తుంటారు. చేతులెత్తి మొక్కుతుంటారు. కాళ్ల మీద పడితే చాలు జన్మధన్యమయిపోతుందనుకునే వారు లక్షల్లోనే ఉంటారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కల్యాణ్ చరిష్మా సినిమాల్లో చెక్కు చెదరలేదు కానీ రాజీకీయాల్లో మాత్రం అది రివర్స్ లో ఉంది. అధికారంలోకి రాకముందు పవన్ కల్యాణ్ కు పొలిటికల్ కూడా అనేక మంది అభిమానులుండే వారు. జనం కోసం పనిచేసే నేతగా ఆయన మాటల్లోనూ, చేతల్లోనూ కనిపించడంతో ఆయనను ఒక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా భావించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ రాజకీయాలను వదలిపెట్టకుండా, ఒక్కసీటు రాకపోయినా, తాను కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయినా రెండో రోజునే తేరుకుని బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ వైఖరిని చూసి పక్కన ఉన్న వారే ఆశ్చర్యపోయారు. సాధారణంగా అలాంటి వైఖరి ఎంత సీనియర్ రాజకీయ నేతల్లోనూ కనిపించదుజఅందుకే సినిమాల్లోగానే రాజకీయాల్లోనూ పవన్ కల్యాణ్ కు ప్రాణమిచ్చే అభిమానులు తయారయ్యారు. సామాజికవర్గం పరంగా కావచ్చు. వివిధ పార్టీలకు చెందిన న్యూట్రల్ ఓటర్లు కావచ్చు. పవన్ కు పొలిటికల్ ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా పెద్దగా ఆయన ఇమేజ్ ఇంచు కూడా చెక్కు చెదరలేదు. కానీ ఏడాది కాలం తర్వాత మాత్రం ఆయన ఇమేజ్ కు బీటలు వారుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాసమస్యలపై పట్టించుకోకపోవడం, రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై స్పందించకపోవడంతో పాటు ప్రతిపక్ష నేతపై ఎప్పటిలాగానే విరుచుకుపడుతుండటం చాలా మందికి నచ్చడం లేదు. . పవన్ కల్యాణ్ వ్యవహారశైలి పొలిటికల్ గా భిన్నంగా మారడం చూసి ఆయనకు ఓటేసిన వారే ఆశ్చర్యపోతున్నారు. ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడకా ప్రజలా సమస్యలపై ప్రశ్నించకుండా, ఇంకా ప్రతిపక్ష నేతను, అదీ పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ను ప్రశ్నిస్తే ఏమొస్తుందన్న భావన అందరిలోనూ కలుగుతుంది. పవన్ కల్యాణ్ అధికారం రుచులు చూసిన తర్వాత తన వైఖరిని తానే మార్చుకున్నట్లుందన్న కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉంటూ ప్రశ్నించడం కష్టమేకావచ్చు. కానీ అన్ని విషయాల్లోనూ తలూపితే ప్రభుత్వం తీసుకునే కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కూడా పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏ విషయమైనా సూటిగా మాట్లాడి తనపై పడుతున్న అపవాదును తానే చెరిపేసుకోవాలని కోరుకుంటున్నారు.