YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

హైదరాబాద్,జూన్ 24, 
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుల విచారణ బీఆర్ఎస్ ముఖ్య నేతలనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి, ఈ కేసును విచారిస్తున్న సిట్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో బండి సంజయ్ స్వయంగా తన ఫోన్‌ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో, ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో ఆయన్ను బాధితుడిగానూ, ఓ సాక్షిగానూ విచారించాలని సిట్ నిర్ణయించింది. అయితే, ఈ నోటీసులు జారీ వెనుక బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పక్కా కాంగ్రెస్ మార్క్ రాజకీయంగా చెబుతున్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా రెండు రాజకీయ లక్ష్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేందుకు ఉపయోగపడుతుందని అర్థం అవుతోంది..బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాప్ చేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా, కీలక ప్రతిపక్ష నేతలంతా కేసీఆర్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ విషయంలో విచారణ ప్రారంభించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు, ఎస్.ఐ.బీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ డీసీపీ రాధా కిషన్ రావు, అదనపు ఎస్పీ భుజంగరావు, అదనపు ఎస్పీ తిరుపతన్నను సిట్ విచారణ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, వికారాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత పటోళ్ల మహిపాల్ రెడ్డి సిట్ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. వై.ఎస్ షర్మిళ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. దీని ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష నేతలందరి ఫోన్లను అక్రమంగా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసిందని ప్రజల ముందు చెప్పే ప్రయత్నం ఇది.బండి సంజయ్ పలు మార్లు తన ఫోన్‌ను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ప్రతిపక్ష నేతగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీని భాగస్వామిగా చేయడం ద్వారా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఈ విషయాన్ని బలంగా ఉపయోగించుకోవడం కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా చెప్పవచ్చు. దీంతోపాటు, బండి సంజయ్ వంటి కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు తిలోదకాలిచ్చారని, నేతల గోప్యతను హరించిన ప్రభుత్వంగా బీఆర్ఎస్‌ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వ్యూహం ఇందులో దాగి ఉంది. కీలక ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ముఖ్య సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్ వంటి ముఖ్య నాయకులే అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. బండి సంజయ్ లాంటి ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చి ఈ కేసులో సాక్షిగా పిలవడం అంటే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపై చర్యలకు మార్గం సుగమం చేసే వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, ఈ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వడం కేవలం బీఆర్ఎస్‌ను దెబ్బ తీయడం మాత్రమే కాకుండా, బీజేపీని కూడా ఇందులోకి లాగే వ్యూహం కనిపిస్తోంది. గత కొంత కాలంగా బీజేపీ - బీఆర్ఎస్ మధ్య రహస్య స్నేహం దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ కేసు ద్వారా బీజేపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం కనిపిస్తోంది.ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ గట్టిగా మాట్లాడకపోతే, బీజేపీ - బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ప్రజల ముందు ఆ పార్టీని ఎండగట్టే అవకాశం కలుగుతుంది. ఒకవేళ బీజేపీ నేతలు గట్టిగా మాట్లాడితే, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌కు నైతిక మద్దతు దొరికినట్లు అవుతుంది. కేవలం బీఆర్ఎస్ పై కోపంతో తాము ఈ చర్యలకు దిగలేదని, అటు కాంగ్రెస్-బీజేపీ వంటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం అతి పెద్ద కుట్రగా అన్ని పార్టీలు భావిస్తున్నాయని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తోంది. ప్రజల్లో ఇది ప్రతీకార కేసుగా కాకుండా, తాము పారదర్శకంగానే ఈ కేసు విచారణ చేపడుతున్నట్లు కాంగ్రెస్ సర్కార్ చెప్పుకునే అవకాశం ఉంది. బీజేపీ నేతలు ఈ కేసులో తీవ్రంగా స్పందించకపోతే మాత్రం, బీఆర్ఎస్ - బీజేపీలు కుమ్మక్కయ్యాయని ప్రజల ముందు చెప్పే అవకాశం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బీజేపీ భుజం మీద తుపాకి పెట్టి బీఆర్ఎస్‌ను కాల్చడం అని చెప్పాలి. రాజకీయంగా బీజేపీ-బీఆర్ఎస్‌లను ఈ వ్యూహంతో డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని చెప్పాలి.బీఆర్ఎస్, బీజేపీలను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా ఇరుకున పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ లక్ష్యమని తెలుస్తోంది.

Related Posts