
న్యూ డిల్లీ జూన్ 24
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడంతో దేశీయ మార్కెట్లకు జోష్ పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు (Stock Market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 900 పాయింట్లకుపైగా ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 25,200 మార్క్ దాటి ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్ 930 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 275 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా 68 పైసలు పెరిగి 86.10గా ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల సూచీలు రాణిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, లోహ, ఐటీ రంగ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి. రియల్టీ, హెల్త్కేర్ రంగ సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి.ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3.76 శాతం తగ్గి 68.79 డాలర్లుగా ఉంది. ఇక ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు రాణిస్తున్నాయి. జపాన్ నిక్కీ 1.59 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.09 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.69 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 1.38 శాతం మేర పెరిగాయి. చైనా సూచీలు మాత్రం ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.