YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరేళ్ల తర్వాత పెంపు

ఆరేళ్ల తర్వాత పెంపు

హైదరాబాద్, జూన్ 25, 
 రైలు టికెట్‌ ధరలు స్వల్పంగా పెరుగనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కోవిడ్‌ 19 తర్వాత రైల్వే మొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్వల్ప ఛార్జీల పెరుగుదల జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నాన్‌ ఏసీ మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ టికెట్‌ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్‌ ధర కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. 500 కిలోమీటర్లలోపు ప్రయాణానికి సబర్బన్ టిక్కెట్లు, సెకండ్‌ క్లాస్‌ ప్రయాణానికి ఛార్జీల పెంపు ఉండదు. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు టికెట్‌ ధరలు పెరుగుతాయి. 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలంటే కిలోమీటరుకు సగం పైస పెరుగుతుంది. నెలవారీ సీజన్ టికెట్‌లో ఎటువంటి పెంపు ఉండబోదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైల్వే వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్లమీడియా వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.అలాగే జూలై 1 నుంచి తత్కాల్ రైలు టిక్కెట్ బుకింగ్‌లకు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేస్తూ ఇండియన్‌ రైల్వే ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని రైల్వే జోన్‌లకు ఈ మార్పును అమలు చేయనుంది. తత్కాల్ పథకం ప్రయోజనాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఆధార్‌ ప్రామాణీకరణ తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. దీంతో జూలై 1, 2025 నుంచి తత్కాల్ పథకం కింద టిక్కెట్లను ఆధార్ ప్రామాణీకరించిన వినియోగదారులు మాత్రమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా టికెట్‌ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. జూలై 15 ప్రయాణికులు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ ఆధారిత OTP ప్రామాణీకరణ దశ అమలులోకి వస్తుందని, ప్రయాణికులు విధిగా దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ద్వారా భారతీయ రైల్వేల అధీకృత బుకింగ్ ఏజెంట్ల తత్కాల్ టికెట్ రిజర్వేషన్లపై పరిమితులను విధించినట్లైంది.AC క్లాస్ బుకింగ్‌లకు ఉదయం 10.00 నుంచి ఉదయం 10.30 వరకు, నాన్-AC క్లాస్ బుకింగ్‌లకు ఉదయం 11.00 నుంచి ఉదయం 11.30 వరకు అవకాశం ఉంటుంది. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ (CRIS), IRCTC.. ఈ రెండింటినీ అవసరమైన సిస్టమ్ మార్పులు చేయాలని, ఈ మార్పులను అన్ని జోనల్ రైల్వే డివిజన్లకు తెలియజేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ చొరవ ప్రయాణికుల కోసం తత్కాల్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ ప్రక్రియను తీసుకువచ్చింది. జూలై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదేరోజు నుంచి టికెట్‌ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

Related Posts