
హైదరాబాద్, జూన్ 25,
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలంగాణలో ఏడాదిగా ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేటెస్ట్గా సిట్ విచారణ స్పీడప్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా తెరమీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్ ముందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ కవిత పేరును ప్రస్తావించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు. దీంతో ఇన్నాళ్లు వినిపించని కవిత పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. కవిత మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న ప్రచారంపై నోరు మెదపడం లేదు. ఇటువంటి సమయంలో సిట్ గనుక కవితను సాక్షిగా పిలిస్తే ఆమె వెళ్తారా? వెళ్తే ఏం చెబుతారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె రాసిన లేఖ బయటికి రావడం..ఆ తర్వాత చిట్చాట్లు, ప్రెస్మీట్లు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ బాస్ ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ ఉంది. అందుకు తగ్గట్లే కాళేశ్వరం విచారణ రోజు ఫాంహౌస్కు వెళ్లిన కవితతో మాట్లాడేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్లో ఉన్నారా? లేరా? అన్నట్లుగా ఉంది ఆమె ప్రజెంట్ సిచ్యువేషన్.సరిగ్గా ఇదే టైమ్లో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాశ్ బాంబ్ పేల్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్గా ఉంటూ వస్తున్నారు కవిత. మీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది కదా అని మీడియా అడిగినా సమాధానం చెప్పేందుకు కవిత ఇష్టపడలేదు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందని గాని..లేదని గాని చెప్పలేదు కవిత. కనీసం తన ఫోన్ ట్యాపింగ్ వార్తను కూడా ఖండించలేదు.అయితే బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పటి నుంచే కవిత రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారని, ఆ క్రమంలోనే ఆమె ఫోన్ ట్యాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవాలేంటో తెలియదు గాని..అదే నిజమైతే మాత్రం కవిత ఫోన్ను ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరన్న దానిపైనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు తన ఫోన్ ట్యాప్ అయిందన్న సమాచారం కవితకు కూడా తెలుసు కాబట్టే ఆమె ఖండించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి కేసీఆర్కు ఇబ్బందిగా మారుతుందనే కవిత సైలెంట్ ఉంటున్నారట. దీంతో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు బయటపెట్టే పేర్లలో కవిత ఉంటారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. కవిత ఫోన్ ట్యాప్ అయ్యిందన్న ప్రచారం నేపథ్యంలో సిట్ ఆమెను కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేయొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అదే గనుక జరిగితే కవిత సిట్ ముందుకు వస్తారా? రారా అన్నది ఆసక్తి రేపుతోంది.ఒకవేళ సిట్ ముందుకు కవిత వస్తే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే కొన్నాళ్లుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కవితను తండ్రి కేసీఆర్ కూడా దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ పిలిస్తే కవిత ఏం చెబుతారోనని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.