
కాకినాడ, జూన్ 26,
అమలాపురం ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విశ్వరూప్.. అప్పుడు కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాత్రం ఆయన పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారట. ప్రజా సమస్యల మాట అటు ఉంచితే క్యాడర్ కష్టసుఖాలను కూడా పట్టించుకోవడం లేదట. ఇదే జిల్లా నుంచి అప్పట్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చేసిన అప్పటి ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రస్తుతం సైలెంట్గా ఉంటూ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా గాలికి వదిలేయడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ యాక్టివిటీ లేకుండా పోయిందటఇక వైసీపీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న రామచంద్రపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. గత ఎన్నికల్లో తన తనయుడు పిల్లి సూర్య ప్రకాశ్కు టికెట్ ఇప్పించుకుని గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ కూటమి గాలికి ఓటమి తప్పలేదు. ఎంపీ బోస్ మాత్రం రామచంద్రపురం నియోజవర్గంలో పార్టీ కార్యక్రమంలో నేనున్నానని చెప్పుకునే విధంగా తన కొడుకుతో పాటు కనిపిస్తున్నారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న మరొక నేత తోట త్రిమూర్తులు. మండపేట నియోజవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన ఏడాదిగా తన నియోజకవర్గం వరకు అరకొరగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. అయితే తోట త్రిమూర్తులు పెద్దగా యాక్టీవ్గా కనిపించడం లేదని క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారట.గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా చేసి ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చినప్పటికీ అది హోదాగానే ఫీల్ అవుతున్నారట ఆయన. పార్టీ కార్యక్రమాలు కానీ..ప్రజా సమస్యలపై పోరులో దూకుడు చూపించడం లేదంటున్నారు క్యాడర్.ఇక పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గం వైసీపీ పరిస్థితి చెప్పనవసరమే లేదు. అసలు ఆ లీడర్లు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. నేతలు ఎవరికి వారు బిజీ అయిపోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట. కార్యకర్తలకు భరోసా ఇచ్చే నేత లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారట. ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి.