
నెల్లూరు, జూన్ 26,
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మళ్లీ పొగలు సెగలుగక్కుతోందా అంటే….. పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు సభ జరిగింది. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తేడా చేస్తే… తొక్కి నార తీస్తామన్న డిప్యూటీ సీఎం మాటల్ని గుర్తు చేస్తూ…. పవన్ మళ్ళీ అఫెన్సివ్ మోడ్లోకి వచ్చారా అంటూ చర్చించుకుంటున్నాయి రాజకీయవర్గాలు. వైసీపీ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారాయన. పోలీసులపై ఒత్తిడి తెస్తోందని, ఇలాంటి పరిస్థితిని సహించే ప్రసక్తే లేదని క్లారిటీగా చెప్పేశారు పవన్. గొంతులు కోస్తాం… అన్న బెదిరింపులు పిచ్చి ధోరణి అంటూ తీవ్రంగా స్పందించారాయన. అలాంటి అసాంఘిక వ్యాఖ్యలకు భయపడేది లేదని, శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఇప్పుడీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్న విశ్లేషకులు..ఏడాది తర్వాత పవన్ తీరు మారిందని చెప్పుకొస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా…. పాలన మీద, షూటింగ్స్పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం… ఇకనుంచి రాజకీయంగా విపక్షం మీద విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోందని అంటున్నారు. సుపరిపాలనలో ఈ దిశగా సంకేతాలిచ్చినట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడమేకాకుండా… వైసీపీ ఆరోపణలకు దీటైన కౌంటర్స్ ఇచ్చే దిశగా పవన్ వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. సభలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగాన్ని గమనిస్తే… ఈ విషయం క్లియర్గా అర్ధమవుతోందని అంటున్నారు.పవన్ వ్యాఖ్యల ప్రకారం… గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలను విస్తృతంగా ప్రస్తావించి ఇప్పుడు ప్రజలకు వివరించాల్సిన సమయం వచ్చింది. ఇక సైలెంట్గా ఉంటే లాభం లేదని, వైసీపీ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో ఉందని భావిస్తున్నారట పవన్. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, నిజాలను ప్రజల ముందుంచడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని పవన్ అభిప్రాయపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఓవైపు పరిపాలన విషయంలో వేగంగా ఆడుగులు వేస్తుంటే….దానికి తోడుగా పవన్ కూడా రాజకీయంగా వ్యూహాత్మక దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నట్లు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ప్రజా వేదికలపై ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతూ… ఆల్రౌండర్ పాత్ర పోషించేందుకు పవన్కళ్యాణ్ సిద్ధమైనట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలకు మంచి చేయాలంటే… నిజాలను చెప్పాలి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు బహిర్గతం చేయాలన్నది డిప్యూటీ సీఎం ప్లాన్ అట. వాస్తవాల మీద నిర్మితమైన పాలన జరిగితేనే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని సభలో అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మాటలు కేవలం ఆయన వైఖరిని తెలియజేయడమే కాకుండా, ప్రతిపక్షాలపై స్పందించే కొత్త దిశను సూచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన రకరకాల అవకతవకలపై దర్యాప్తు వేగం పెరుగుతోంది. వాటి సారాంశాన్ని రాజకీయ పరంగా ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యతను పవన్ స్వయంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా… రాబోయే రోజుల్లో ప్రెస్మీట్లు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ దిశగా జనసేన కార్యకర్తలకు కూడా సందేశాలు వెళ్ళబోతున్నాయట. మొత్తంగా సుపరిపాలన సభలో… పవన్ తన కొత్త రోల్ గురించి క్లియర్గా చెప్పినట్టే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.