
ములుగు
మంత్రి సీతక్క ఏటూరు నాగారంలో మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల లేఖపై స్పందించారు. సీతక్క మాట్లాడుతూ అ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. అయితే లేఖలో లేని అంశాలపై ఒక రాజకీయ పార్టీ పత్రికలు, మీడియా సంస్థలు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. మహిళ అని చూడకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ తమ రాజకీయ కక్షను తీర్చుకుంటున్నాయి. మహిళపై అసభ్య పదజాలాన్ని వినియోగించడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు.
ఒక మహిళను పట్టుకుని సిగ్గులేదా అని రాయడం ఏం జర్నలిజం. నేను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేను.. వారంలో రెండు మూడు రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నన్ను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయి. అవే శక్తులు ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నాయి. ఒక కోయ మహిళకు జనరల్ పోర్ట్ ఫోలియో దక్కడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పదవి వస్తే సహించలేకపోతున్నారు. నా వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారు . జీవో 49 తో అటవి బిడ్డలు నష్టపోతారని ఆ జీవోను వ్యతిరేకించానని వెల్లడించారు.
మా జీవితాలకు గొడ్డలి పెట్టు లాంటి జీవోను రద్దు చేయాలని కోరాను. గిరిజన సంక్షేమ మంత్రి కాకున్నా..పార్టీలకు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమై జీవో 49 ను రద్దు చేయాలని తీర్మాణించాము. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసి అడవి బిడ్డనే. వారి సంక్షేమం, అభివృద్ది కోసమే నా జీవితం అంకితమని అన్నారు.
ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నాను. అడవి బిడ్డల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నాము. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలు మా దృష్టి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో, ప్రిన్స్ పల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ - పీసీసీఎఫ్ సువర్ణ తో స్వయంగా మాట్లాడాననని అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు జరగకుండా చర్యలు చేపడుతామని వారు హమీ ఇచ్చారు. ప్రతిపక్షంలోనైన అధికార పక్షంలోనైనా నాదొకటే నినాదం. కొత్త అడవి కొట్టొద్దు.. పాత అడవిని వదిలిపెట్టదు అన్నదే నా విధానం. అప్పుడైనా ఇప్పుడైనా అదే నా పోరాటం. నా నియోజకర్గంలో కొంతమంది అడవి అధికారులు ఆదివాసి గుడిసెల మీద దాడి చేశారు. ఘటన నా దృష్టికి రాగానే అధికారులకు ఫోన్ చేసి వెనక్కు పంపించి వేశాను. సొంత నిర్ణయాలతో అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాము . ప్రజలకు న్యాయం చేస్తున్నాం... ఎక్కడ కూడా మా బాధ్యతలను విస్మరించలేదు. ఆదివాసులు, అట్టడుగు వర్గాలు, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం నిలబడతాం. బీఆర్ఎస్ హయాంలో ఆదివాసులపై దాడులు చేశారు..ఇప్పుడు లేని ప్రేమ ఒలక బోస్తున్నారు. చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టారు.. చెట్లకు కట్టేసి కొట్టారు...ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోడు సమస్యలను పరిష్కరించలేదు. మీ హయంలో అడవిబిడ్డలకు ఇండ్లు ఇస్తే సమస్యలే ఉత్పన్నం కాకపోవు. ఒక ఆదివాసి బిడ్డను టార్గెట్ చేశామని సంబరపడుతున్నారు. మావోయిస్టుల లేఖను అడ్డం పెట్టుకొని నన్ను అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఓడించేందుకు వంద కోట్లు ఖర్చు చేశారు.. అయినా ములుగు ప్రజలు నాకు రికార్డు మెజార్టీ ఇచ్చారని అన్నారు.
ప్రజలిచ్చిన మంత్రి పదవితో ఏజెన్సీ ప్రజలు, పేదలను అభివృద్ధి పరుస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగంలో అనేక హక్కులు అధికారాలు పొందుపరచడంలో నెహ్రూ గారు అంబేద్కర్ ఎంతో కృషి చేసారు. వారి వల్లే మాకు హక్కులు దక్కాయి..వాటిని పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటానని అన్నారు.