
కరీంనగర్, జూలై 3,
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది. మొదటి దశలో ఇళ్లు మంజూరు చేసి, ప్రొసీడింగ్ కాపీలు అందించిన తర్వాత, కొందరు లబ్ధిదారులు గతంలో లబ్ధి పొందారని గుర్తించి అధికారులు ఇళ్లను రద్దు చేశారు. దీంతో ఇళ్లు కూల్చుకున్న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో లబ్ధి పొందిన వారికి మళ్లీ ఇళ్లు ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే.. రాష్ట్రంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. హామీ ఇచ్చినట్లుగానే తాజాగా రేవంత్ సర్కార్.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా ముందుగా సొంత స్థలాలు ఉన్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఆ తర్వాతే ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందించింది. వారంతా ఎంతో సంతోషంగా ఇంటి నిర్మాణం ప్రారంభించి.. ఆ పనుల్లో బిజీగా ఉండగా.. అధికారులు వారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. మీరు అర్హులు కాదంటూ ఇళ్లు రద్దు చేశారు. అధికారులు నిర్ణయం పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లే చేసి.. తిరిగి లాక్కుంటున్నారు అధికారు. ఎందుకంటే.. సదరు లబ్ధిదారులు గతంలో లబ్ధి పొందారని.. అలాంటి వారు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కాదని తేల్చిచెబుతున్నారు. తాజాగా కరీనంగర్ జిల్లాలో సుమారు 11 మందికి ఇలానే బిల్లులు రావని చెప్పడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు వచ్చిందని చెప్పి.. ఉన్న గూడును కూల్చేసుకున్నాము.. ఇప్పుడు ఇలా క్యాన్సిల్ చేయడం ఏంటి.. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా.. హైదరాబాద్లో తప్ప.. మిగతా 32 జిల్లాల్లో సుమారు 3.71లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటికే 2.40లక్షల మందికి ప్రొసీడింగ్ కాపీలను కూడా అందిజేశారు. వీటిల్లో 1.10లక్షల ఇళ్లను గ్రౌండింగ్ కూడా చేశారు. తీరా ఇప్పుడు చూస్తే.. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారుల్లో దాదాపు 10 శాతం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇళ్లు పొందరాని అధికారులు గుర్తించారు. మరికొందరు తక్కువ ధరకే వస్తున్న సిమెంట్, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించిన నగదు తీసుకున్నట్లుగా అధికారులు తాజాగా గుర్తించారు.అలానే కొందరు ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తున్న సిమెంట్ తీసుకుని ఇళ్లను నిర్మించుకోలేదని.. ఇంకొందరు సగంలోనే ఇంటి నిర్మాణం వదిలేసినట్లుగా గుర్తించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ఇళ్లు పొందిన వారిలో కొందరికి తాజాగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అయితే వారు గతంలో ఇళ్లు పొందరాని తెలియడంతో.. వారికి తాజాగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేస్తున్నారు.ఇచ్చినట్లే ఇచ్చి.. ఇళ్లను లాక్కోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అన్ని విధాల ఇందిరమ్మ ఇళ్లు పొందడానికి అర్హులమని పరిశీలించిన తర్వాతే కదా ఇళ్లను మంజూరు చేశారు. తీరా ఉన్న ఇంటిని కూలగొట్టి.. కొత్తింటి నిర్మాణం చేపట్టాక మీరు అర్హులుక కాదని చెప్పడం ఏంటంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై హౌసింగ్ కార్పొరేషన్ సీఈని సంప్రదించగా.. గతంలో లబ్ధి పొందిన వారికి ఇప్పుడు ఇళ్లు ఇవ్వడం లేదు. అయితే కొన్నిచోట్ల అధికారుల లాగిన్తో ప్రొసిడింగ్స్ వస్తున్నాయిన.. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో వారు అనర్హులని తేలుతుందని అంటున్నారు. గతంలో పునాది వరకు నిర్మించుకుని వదిలేసిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.