
కాకినాడ, జూలై 9,
చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా.. సర్థుకోవాలి..కలిసి పోవాలి..! ఇలా ఒకదాని వెంట మరోటిగా తూటాల్లాంటి మాటలతో సొంత నేతలకు హితబోధ చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇదే సమయంలో ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎలా వస్తారో మేమూ చూస్తామంటూ సవాల్ చేశారాయన. ఈ కామెంట్లపైనే ఇప్పుడు ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. పవన్ వ్యాఖ్యల వెనుక మతలబేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది. ఇది ఓ పాపులర్ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్. అచ్చం ఇదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడే ప్రతి మాటకూ ఓ లెక్క ఉంటుంది. వినే వాళ్లు, చూసే వాళ్లు అది తెలుసుకోవాలి అంతే. లేటెస్ట్గా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. మరోసారి అత్యంత కీలకమైన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా మారాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ.. ఓవైపు కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య మనస్పర్థలు, అసంతృప్తులు కొనసాగుతున్నాయని విపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైకి కలిసి ఉన్నట్లుగా చెప్పుకుంటున్న కూటమి పార్టీలు.. కొన్నిచోట్ల లోలోన కత్తులు దూసుకుంటున్నాయని సెటైర్లు వేస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలకు కూటమిలో పెద్దగా ప్రాధాన్యం లేదని ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతెందుకు ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న వేళ.. గడపగడపకూ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వెళుతున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తున్నారు. కానీ, జనసేన, బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా వీటిల్లో పాల్గొనడం లేదు. దీనిపైనా ప్రత్యర్థి వైసీపీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. సరిగ్గా ఇలాంటి వేళ.. ప్రకాశం జిల్లా పర్యటనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రత్యర్థి పార్టీ నేతల కామెంట్లకు కౌంటర్లు వేశారు. ఇదే సమయంలో కూటమి పార్టీలకు కొన్ని సూచనలు చేశారాయన. ఏపీలో కూటమి పాలన 15 ఏళైనా సాగాలన్న పవన్. ఏపీలో కూటమి పాలన కనీసం 15 ఏళ్లపాటైనా సాగాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్. అప్పుడే ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సరిగా చేరతాయన్నారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు కలిసి కట్టుగా సాగడం ఎంతో అవసరం అంటూ హితబోధ చేశారు పవన్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు చిన్నచిన్న అసంతృప్తులు సహజమన్నారాయన. అందుకే ఏ పార్టీనీ తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు పవన కల్యాణ్. పిడికిలిలా కూటమి ముందుకు సాగాలన్న పవన్. అన్ని వేళ్లూ ఒకేలా ఉండవన్నారు జనసేన అధినేత. అయినా సరే ఏ వేలి బలం ఆ వేలుకు ఉంటుందన్నారు. అందుకే పిడికిలిలా ముందుకు సాగాలన్నారు. ఇక్కడ కూటమి అంటేనే ఓ పిడికిలి అంటూ మూడు పార్టీల కార్యకర్తలకు హితబోధ చేశారు పవన్. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగడం తప్పనిసరి అన్నారు పవన్. ఇదే సమయంలో తనకు పాలనలో ఏ మాత్రం అనుభవం లేదన్నారు. కానీ, గట్టిగా పోరాడే ధైర్యం మాత్రం ఉందన్నారు పవన్. కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంత ప్రణాళికా బద్దంగా నడిపించడం కష్టమంటూ చెప్పుకొచ్చారాయన. కొట్టుకోమని అధికారం ఇవ్వలేదంటూ హితబోధ. కష్టపడమని, సమస్యలు పరిష్కరించమని కూటమి పార్టీలకు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు పవన్. అంతేకాని కొట్టుకోమని కాదంటూ సుతిమెత్తగానే ఘాటైన హెచ్చరికలు చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తా, నాయకుడు గుర్తు పెట్టుకోవాలని సూచించారు జనసేన అధినేత. తనకు జనసేన సంక్షేమం, కూటమి సంక్షేమం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని తెగేసి చెప్పారు పవన్. తద్వారా పరిస్థితులు ఎలా ఉన్నా.. కూటమి పార్టీలు కలిసి కట్టుగా సాగాల్సిందేనన్న సందేశం ఇచ్చారన్న అభిప్రాయం గట్టిగా విన్పిస్తోంది. 2029లో ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామంటూ.. సవాల్. కేవలం కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులకు హితబోధ చేయడమే కాదు.. ప్రత్యర్థి పార్టీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రౌడీయిజానికి, గూండాయిజానికి భయపడితే రాజకీయం చేస్తామా అంటూ ప్రశ్నించారాయన. మేం అధికారంలోకి వస్తే అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని.. అసలు 2029లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు పవన్ కల్యాణ్ .మొత్తంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు విశ్లేషిస్తే.. కూటమిగా కలిసి కట్టుగా సాగాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సాగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తాను ఆ దిశగా ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటానన్న సంకేతాలను మరోసారి బలంగా పంపారన్న కామెంట్లు విన్పిస్తున్నాయి.