
కర్నూలు, జూలై 9,
ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా అధ్యయనాలు, కసరత్తులు జరిపింది ఏపీ ప్రభుత్వం. ఎట్టకేలకు ప్రారంభించేందుకు సిద్ధపడింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉచితం అనేది కాకుండా.. జిల్లాలకు పరిమితం చేయడంతో మహిళలు ఇప్పుడు షాక్ కు గురవుతున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కర్ణాటక తో పాటు తెలంగాణ మాదిరిగా కాకుండా ఏపీలో కేవలం జిల్లాలకే పరిమితం చేయడం విశేషం.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ప్రయాణానికి సంబంధించి.. అధ్యయనానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులతో కూడిన బృందం కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి అధ్యయనం చేసింది. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఉచిత ప్రయాణ పథకం పట్టాలు ఎక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ జిల్లాల వరకే ఈ పథకం పరిమితం చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని భావిస్తున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు జిల్లాలకు ఈ ఉచిత ప్రయాణ పథకం పరిమితం చేయడం విశేషం. దీనిపై విపక్షాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం ప్రారంభిస్తారని భావించారు. కానీ, దీని సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లపై ప్రభుత్వం అధ్యయనం జరిపి.. పథకాన్ని పక్కగా అమలుచేయడానికి ప్రణాళిక వేసింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ పథకంపై విదివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది.