YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వ్యూహాలు, ప్రతివ్యూహాలు మారుతున్న సమీకరణాలు..!!

వ్యూహాలు, ప్రతివ్యూహాలు మారుతున్న సమీకరణాలు..!!

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అనేది గత కొంత కాలంగా వినిపిస్తోన్న మాట. ‘కమలం పార్టీ నన్ను టార్గెట్ చేసింది. ఢిల్లీలో నాకు, రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంద’ని సాక్షాత్తూ చంద్రబాబే ఆరోపిస్తున్నారు. బీజేపీ పెద్దలు కొద్ది రోజులుగా తెలుగు నేతలతో వరుస భేటీలు జరుపుతుండటాన్ని టీడీపీ అనుమానిస్తోంది. తమకు వ్యతిరేకంగా జరిగే కుట్రలో భాగంగానే తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఈ సమావేశాలను చూస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ తదితరులు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. మరుసటి రోజు కన్నా ప్రధాని మోదీని కలిశారు, అమిత్ షాతో, ప్రధాని కార్యాలయ అధికారులతోనూ భేటీ అయ్యారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సాఆర్‌సీపీ నేత, ఏపీ పీఏసీ అధ్యక్షుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి రామ్ మాధవ్‌ను కలిశారని ప్రచారం జరుగుతోంది. ఆకుల మాత్రం బుగ్గనతో కలిసి ఢిల్లీలో భోజనం చేశామని చెబుతున్నారు. కాగా, ఏపీ ప్రాజెక్టుల్లో జరిగిన అవతవకల గురించి బుగ్గన బీజేపీ అధిష్టానానికి కీలక సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లి రావడం, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనల పట్ల కూడా టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాం మాధవ్ వరుస మంతనాలతో తీరిక లేకుండా గడపటం వెనుక ప్రధాన టార్గెట్ చంద్రబాబే అనే అంశాన్ని టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా జనాల్లోకి తీసుకెళ్తోంది. ఈ భేటీల సందర్భంగా కీలక సమాచారం చేతులు మారిందని, చంద్రబాబుపై బీజేపీ దాడికి సిద్ధం అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే ప్రధానిని కలిసిన గవర్నర్ కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ ఢిల్లీ వెళ్లి మోదీని కలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ కుమ్మక్కైంది. ఢిల్లీలో జరుగుతున్న వరుస భేటీల వెనుక మనల్ని ఏదో చేయాలనే ఆలోచనే కారణం. ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కోవడానికి సిద్ధం’ అని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ కేసులు పెట్టడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబును బీజేపీ నేరుగా టార్గెట్ చేయదని, ఏపీలోని కీలక శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న మంత్రిని లక్ష్యం చేసుకుని ముందుగా అడుగులేయనుందని మరో వర్గం చెబుతోంది. ఆయన ద్వారా బాబు సర్కారు అవకతవకల్ని బయటకు తీసుకొచ్చేందుకు కమలం పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందని, ఇప్పటికే ఆ దిశగా గ్రౌండ్ వర్క్ జరిగిందని చెబుతున్నారు. పట్టిసీమ అవకతవకల పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఓటుకు నోటు కేసు కూడా తెర మీదకు వచ్చింది. గత కొంత కాలంగా మరుగున పడిన ఈ కేసు దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకోనుందని తెలుస్తోంది. బీజేపీ టార్గెట్ ఏంటి? తెలుగు నేతల ఢిల్లీ టూర్ వెనుక ఆంతర్యాలేంటి అనే విషయాల్లో త్వరలోనే క్లారిటీ రానుంది. 

Related Posts