
హైదరాబాద్
తెలంగాణ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నది. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారు. షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందించారు. అంతేకాదు దేశంలో మొదటిసారి ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనమిచ్చి గౌరవించిన రాష్ట్రం తెలంగాణ. రంజాన్ తోఫా ఇచ్చి ముస్లిం సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు కేసీఆర్. కాంగ్రెస్ ఎన్నికల్లో ఏం చెప్పింది మైనార్టీ సబ్ ప్లాంట్ ఇస్తాం. నాలుగువేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తాం. ఇమామ్, మౌజన్లకు 5000 నుండి 12 వేలకు పెంచుతామన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసిఆర్ 20 లక్షలు ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారు.
ఇందులో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువచ్చి వారితో మాట ఇప్పించాడు. ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్త లేరు. ఒక లక్ష 12 వేల మంది పేద మైనార్టీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కేసీఆర్ అందించాడు. కాంగ్రెస్ తులం బంగారం ఇస్తామని మోసం చేసి షాదీ ముబారక్ కూడా ఇవ్వడం లేదు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేసినంత దేశంలో మరి ఏ నాయకుడు చేయలేదు. మైనార్టీలకు 4 వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కానీ ఇచ్చింది 1000 కోట్లు. రంజాన్ తోఫా బంద్ అయింది. కేసీఆర్ కిట్టు బంద్ అయింది. ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ అయింది. ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ అయింది. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మరొక మంత్రి మహమూద్ అలీ. కేసీఆర్ మైనారిటీలకు ఇచ్చిన గౌరవం అది.
మైనార్టీలు మంత్రిగా అంటే మైనార్టీ పోర్ట్ ఫోలియో ఏదో ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ కేసీఆర్ మైనార్టీ మంత్రికి ప్రాధాన్యత ఉన్న శాఖలను ఇచ్చి గౌరవించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు బుద్ధి చెప్పాలి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలి. హైడ్రా, మూసీ పేర్లతో ముస్లిం సోదరుల ఇళ్లను కూల్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కూల్చిన ఇండ్లకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదు రేవంత్ రెడ్డని అన్నారు.
రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్లను ఇవ్వలేదు కానీ ఉన్న ఇళ్లను కూలగొట్టాడు. రేవంత్ రెడ్డి స్వయంగా చెబుతాడు నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నాను. కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నానని. పొద్దుతిరుగుడు పువ్వు లాగా రేవంత్ రెడ్డి బీజేపీ చుట్టూ తిరుగుతుంటాడు. బీజేపీలో చదువుకున్నానని స్వయంగా చెప్పే ముఖ్యమంత్రిని మైనార్టీలు ఎలా నమ్మాలి. అందరం కలిసి పనిచేసి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని కోరుతున్నానని అన్నారు,