YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు?

టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు?

తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివ్రుద్ధి చేయాలన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.  బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. అమిత్ షా కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ కు ఫోన్ చేసి బర్త్ డే విషేశ్ తెలిపారు. మరోవైపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే....
ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రశాంత వాతావరణంలో జీవించాలి. ఈ దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలి. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివ్రుద్ధి కోసం, ప్రజల సంక్షేమం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకున్నా.
తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అభివ్రుద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులను కేటాయించి యుద్ద ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి అభివ్రుద్ధి చేయాలని కోరుతున్నా. కరీంనగర్ లో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. వెంటనే నిర్మించాలి. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు నిధులు కేటాయించి అభివ్రుద్ధి చేయాలి.
హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురద్రుష్టమేమిటంటే టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది. స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు. హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వాళ్లను తొలగించాలి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం కరెక్ట్ కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదు. ఇది హిందువుల ఆస్తి. నేనడుగుతున్నా... మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకుని హిందువులు వెళితే ఉద్యోగాలిస్తారా? ఇవ్వరు కదా? అట్లాంటప్పుడు టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు?  ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా ఈ ఆనవాయితీని కొనసాగించడం మంచి పద్దతి కాదు. తక్షణమే వాళ్లను తొలగించాలని కోరుతున్నా.

Related Posts