
హైదరాబాద్:
నగరంలోని మలక్ పేటలో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. మలక్పేటలోని శాలివాహననగర్ పార్క్ లో వాకర్స్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. దుండుగల కాల్పుల్లో చందు నాయక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు శాలివాహననగర్ పార్కు వద్దకు చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. పార్క్ సమీపంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.
చందూనాయక్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం శాలివాహననగర్ లోని పార్కుకు మార్నింగ్ వాక్కు వెళ్లాడు. మార్నింగ్ వాక్ చేసి, వర్కౌట్లు చేయడానికి వెళ్లిన వ్యక్తిపై ఒక్కసారిగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. కారం చల్లి నాలుగు రౌండ్స్ కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్చడంతో బుల్లెట్ గాయాలై.. తీవ్ర రక్తస్రావంతో చందు నాయక్ స్పాట్ లోనే మృతిచెందాడు. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. మృతుడు చందు నాయక్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన వామపక్ష నాయకుడిగా గుర్తించారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది.