
ఏలూరు, జూలై 21 ,
కోనసీమ వాసుల చిరకాల స్వప్నం నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి! కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ కోసం 24 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల నిరీక్షణ ఫలించనుంది. ఇక కాకినాడ, రాజమండ్రి వెళ్లాల్సిన అవసరం లేదు. మూడేళ్లలో కోనసీమలో రైలు కూత వినపడుతుంది! భూసేకరణ పూర్తి చేసి, రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయనున్నారు. ఈ రైలు మార్గం 8 మండలాలు, 25 గ్రామాల మీదుగా వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ కోనసీమ వాసుల దశాబ్దాల కల సాకారానికి అడుగులు పడుతున్నాయి. కోటిపల్లి, నర్సాపురం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం ఈ ప్రాంత వాసులు సుమారు 24 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడనుంది. ఇక వారు రైలు ఎక్కాలంటే కాకినాడో, రాజమహేంద్రవరమో వెళ్లాల్సిన పని లేదు. వారి ప్రాంతంలోనే రైలు పరుగులు పెట్టనుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే కేవలం మూడేళ్లలోనే కోనసీమలో రైలు కూత వినిపించనుంది. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైను నిర్మాణ పనులకు అడ్డంకిగా మారిన ఎలైన్మెంట్లపై కోర్టు స్టేలు ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండో విడత భూసేకరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రానున్న ఐదు నెలల్లోనే భూసేకరణ పూర్తిచేసి ఆ స్థలాన్ని రైల్వేకు అప్పగించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. దీంతో రైల్వై లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది.ఈ రైల్వే లైను మొత్తం పొడవు 57.81 కిమీలు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కోటిపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరకు దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్టు మొత్తం 8 మండలాలు, 25 గ్రామాల పరిధిలో ఏర్పాటు కానుంది. దీనికి 846 ఎకరాల భూమి అవసరం. మొదటి విడత భూ సేకరణలో భాగంగా అధికారులు రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట మండలాల్లోని 8 గ్రామాల గుండా సుమారు 13.45 కి.మీ. పొడవున రైల్వే లైను ఏర్పాటుకు 255.835 ఎకరాలు గుర్తించారు.22 ఏళ్ల క్రితమే అనగా 2003 సంవత్సరంలోనే అధికారులు భూమిని సేకరించగా.. రైల్వే శాఖ ఇంకా దీన్ని స్వాధీనం చేసుకోలేదు. పైగా రైతులు కూడా తమకు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం 279 ఎకరాల భూమిని రైల్వేకు అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.రెండో విడత భూసేకరణ పనుల్లో భాగంగా 34.90 కిమీల రైల్వే లైన్ నిర్మాణం కోసం అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామం నుంచి మలికిపురం మండలం గుడిమెల్లంక వరకు 18 గ్రామాల పరిధిలో 590.348 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు రాజోలు, మామిడికుదురు, మలికిపురం మండలాల్లోని 13 గ్రామాల్లో సర్వే చేసి 402.637 ఎకరాలు గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి సేకరణ కోసం తొలుత ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసి, ఐదు నెలల్లో భూసేకరణ పూర్తిచేస్తామని తెలిపారు.ఆ తర్వాత మిగిలిన 188 ఎకరాల భూసేకరణపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇందు కోసం 5 గ్రామాల్లో సంయుక్త సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. మూడు వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మూడు బ్రిడ్జీల నిర్మాణం కోసం ఇప్పటికే అమలాపురం మండలం పేరూరు, మామిడికుదురులోని పాశర్లపూడి, మలికిపురంలోని గుడిమెల్లంక వద్ద 24 ఎకరాల భూమిని ఇప్పటికే రైల్వేకు అప్పగించగా పనులు ప్రారంభించారు. పనులు ఇలానే వేగంగా సాగితే మూడేళ్లలోనే కోనసీమ వాసుల కల వాస్తవ రూపం దాల్చనుంది.