
పిఠాపురం, జూలై 21,
పిఠాపురం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? కనీసం అక్కడ వాయిస్ వినిపించేవారు లేరు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత పెద్దగా కనిపించడం లేదు ఎందుకు? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు పెండ్యం దొరబాబు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన జనసేనలో చేరిపోయారు. దీంతో జనసేన బలమైన శక్తిగా ఎదిగింది. ఎందుకో వంగా గీత మాత్రం పెద్దగా స్పందించడం లేదు. పార్టీ కార్యక్రమాలను తూతూ మంత్రంగా చేపట్టి వదిలేస్తున్నారు. అయితే భవిష్యత్తు కార్యాచరణ దృష్ట్యా ఆమె వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది. వంగా గీతాది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చురుగ్గా పనిచేశారు. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ సమయంలో మెగాస్టార్ కుటుంబంతో ఆమెకు మంచి సంబంధాలే నడిచాయి. వంగా గీత విషయంలో మెగా ఫ్యామిలీ కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. అయితే వైసిపి హయాంలో కాకినాడ ఎంపీగా పనిచేశారు గీత. తరువాత పవన్ కళ్యాణ్ పై అనూహ్య పరిస్థితుల్లో పోటీకి నిలబడాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో సైతం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థి వంగా గీత మంచి మహిళ అని.. ఎప్పటికైనా ఆమె జనసేనలో చేరడం ఖాయమని తేల్చి చెప్పారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో రెండు మూడు ఘటనలు జరిగాయి. కానీ వంగా గీత పెద్దగా స్పందించలేదు. తాజాగా రాష్ట్రస్థాయిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు జరపాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ ఆందోళనలు జరగలేదు. తొలి రెండు రోజులు వంగా గీత నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు. కానీ 100కు మించి వైసిపి కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు గీత భవిష్యత్తు విషయంలో ఒక ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. పిఠాపురం వర్మ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్న ప్రచారం చేస్తోంది. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో వర్మ వైసీపీలోకి వస్తే తన పరిస్థితి ఏంటనేది గీతకు తలెత్తుతున్న అనుమానం. అందుకే పార్టీ కార్యక్రమాలను ఏదో తూతూ మంత్రంగా నిర్వహించాలన్న ఆలోచనతో ఆమె ఉన్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. లేనట్టేనని ఆ పార్టీ వర్గాలే చెబుతుండడం విశేషం.ప్రస్తుతం అక్కడ జనసేన బలంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు పదవి చేపట్టిన పెండ్యం దొరబాబు తన అనుచరులు, క్యాడర్ తో జనసేనలోకి వచ్చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కొనసాగుతూ వస్తోంది. అయితే వైసిపి ఎక్కువగా వర్మపై ఫోకస్ పెడుతుండడం.. గీత భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అయితే మెగా ఫ్యామిలీతో ఆమెకు ఉన్న అనుబంధం దృష్ట్యా జనసేనలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.