YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రింగ్ రైలు డీపీఆర్ రెడీ

రింగ్ రైలు డీపీఆర్ రెడీ

హైదరాబాద్, జూలై 21, 
తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు రూ.12,070 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దక్షిణ మధ్య రైల్వే దీన్ని 8 జిల్లాలు, 14 మండలాల పరిధిలో చేపట్టనుంది, ఇందులో 26 కొత్త రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి, రవాణా మెరుగుదలకు కీలకం కానుంది.తెలంగాణలో ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు (హైదరాబాద్ రీజినల్ రింగు రైల్) ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టుకు రూ.12,070 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దక్షిణ మధ్య రైల్వే  ఈ ప్రాజెక్టును రాష్ట్రంలోని 8 జిల్లాలు, 14 మండలాల పరిధిలో చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో 26 కొత్త రైల్వే స్టేషన్లు రానున్నాయిముందుగా 508 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్‌రెడ్డి సూచనల మేరకు 392 కిలోమీటర్లకు తగ్గించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండేలా ఈ అలైన్‌మెంట్‌ను ఎంపిక చేశారు. ఆర్ఆర్ఆర్‌కు 3-5 కి.మీ. దూరంలో ఉంటుంది, రెండు చోట్ల మాత్రం 11 కి.మీ. దూరం ఉండనుంది. దూరం తగ్గినా.. అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరగా ఈ మార్గం రానుండటం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ 392 కిలోమీటర్ల రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు పంపించడానికి సిద్ధమవుతున్నారు.ఈ ప్రాజెక్టులో ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించనున్నారు. అంటే పాత రైలు మార్గాలపై కొత్త లైన్‌ను ఎత్తుగా, ఫ్లైఓవర్‌లో నిర్మిస్తారు. ఈ ప్రాంతాలుగా మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్‌లను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. ఈ రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో కూడిన రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీమోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఔటర్‌ రింగ్‌ రైలు వెళ్లే జిల్లాలు: మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట.
అలైన్‌మెంట్ మార్గం: ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్‌ మీదుగా ఈ రింగ్ రైలు మార్గం అలైన్‌మెంట్ ఖరారు చేయబడింది.

Related Posts