
హైదరాబాద్, జూలై 24,
ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేసిన సిట్ విచారణ జరుపుతోంది. తాజాగా శర్వాణీ డిస్టిల్లరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈనెల 28వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లిక్కర్ స్కాం కేసులో PMLA చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈడీ. లిక్కర్ స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలున్నాయి.2019-2024 మధ్య శర్వాణి అల్కా బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ కు మద్యం సరఫరా చేసిందనీ, 894 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని సిట్ మొన్నీమధ్య తన చార్జిషీట్లో తెలిపింది. ఆంధ్రా గోల్డ్ విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, అరిస్టోక్రాట్ ప్రీమియమ్ విస్కీ బ్రాండ్ల పేరుతో మద్యం ఉత్పత్తి చేసిందని సిట్ తెలిపింది. ఈ సంస్థ మద్యం సిండికేట్కు 133 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చిందని సిట్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో శర్వాణి సంస్థ డైరెక్టర్ చంద్రరెడ్డి ఈఢీ నోటీసులు ఇచ్చింది.ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం కేసులో నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. విదేశాలకు పారిపోయిన వారిని ఏపీకి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే ఇంటర్పోల్ సహకారం తీసుకునే యోచనలో ఉంది సిట్. కేసులో కీలకమైన 12 మంది అరెస్టు అయ్యారు. మిగతా 9 మంది విదేశాలకు పరారైనట్లు సిట్ గుర్తించింది. కేసు నమోదుతో 9 మంది కీలక నిందితులు విదేశాలకు పరారయ్యారు. లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వసూళ్ల నెట్వర్క్లో 9 మంది కీలక నిందితులుగా ఛార్జ్షీట్లో పేర్కొంది సిట్.