
సింగపూర్
సింగపూర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. సింగపూర్ లో 10 వేల కటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్ లో రెండు గంటల పాటు కాలి నడకన అయన పర్యటించారు. సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. బిడదారీ హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దింది. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరలో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై చర్చ జరిపారు. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సీఎం బృందం సందర్శించింది. 10 వేల కుటుంబాలు నివాసం ఉండేలా అన్ని వసతులతో పర్యావరణ హితంగా నివాస సముదాయాన్ని సింగపూర్ ప్రభుత్వం నిర్మించింది. శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్ గా సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటీ మార్చింది. అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా బిడదారి ఎస్టేట్ లో సీఎం బృందం పర్యటించింది. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని సింగపూర్ అధికారులు వివరించారు.
తరువాత సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పోరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమయింది. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో సీఎం బృందం పంచుకుంది. *ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చ జరిగింది. బిడదారి ప్రాజెక్ట్ ను రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్టు అద్భుతంగా ఉంది. అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరం అని అన్నారు.
*కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశం, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాం. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందనీ పేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మద్య కొన్ని సమస్యలు వచ్చాయి. కొన్ని నిర్ణయాల కారణంగా రాష్ట్రం నమ్మకాన్ని కోల్పొయిందనీ.. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి సింగపూర్ వచ్చాననీ తెలిపారు. *ఏపిలో, అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవల్మెంట్ బోర్డును కోరారు.