
పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు భిన్నంగా నర్సంపేట పట్టణం హనుమాన్దేవల్ ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని విధంగా విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ప్రహరీ, తరగతి గదుల్లోని గోడలపై జాతీయ నాయకుల చిత్రాలు, జంతువుల, దేశ, విదేశాల, రాష్ట్రం, జిల్లా చిత్రపటాలను రంగుల పెయింటింగ్తో చిత్రీకరించడంతో, ఆంగ్లంలో రైమ్స్ను అందంగా రాసి విద్యార్థులను ఆకర్షించేలా తీర్చిదిద్దారు.గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను అందించే ఆశయంతో ప్రభుత్వం 2005లో మండలానికో పాఠశాలను ఏర్పాటు చేసింది. నర్సంపేట పట్టణం నడిబొడ్డునున్న పాఠశాలను ఎంపిక చేశారు. ప్రభుత్వం సరిగా పర్యవేక్షణ చేయకపోవడంతో ఎక్కువ మండలాల్లో మధ్యలోనే నిలిపేశారు. ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన యధావిధిగా కొనసాగించారు. 2011 జూన్ 12న పూర్ణచందర్ ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బదిలీపై వచ్చినప్పుడు 80 మంది విద్యార్థులున్నారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా ఆటపాటలతో విద్యను బోధిస్తూ చిన్నారులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు సాయంత్రం 5 గంటల దాకా పాఠశాలలోనే ఉండి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంలో బేసిక్స్ చెబుతూ ప్రత్యేక బోధన చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 360 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడితో పాటు 9 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులుండగా మరో ఇద్దరు డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు.విద్యతో పాటు ఇతర అంశాల్లో ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు వారానికో రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆయా అంశాల్లో ప్రావీణ్యం కల్పించేందుకు ఉపాధ్యాయులు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఒక వారం బాలానందం, నాటికలు, మాక్ డ్రిల్, క్విజ్, అంత్యాక్షరి ఇలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందరినీ ఆకర్షిస్తున్న పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులను అరకొర వసతులు, గదుల కొరత, క్రీడా మైదానం లేకపోవడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య మేరకు ఐదు మరుగుదొడ్లు అవసరమైతే ఒకటి మాత్రమే ఉంది. క్రీడా మైదానం లేదు. విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు