
జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందనిమంత్రి కేటిఅర్ తెలిపారు. నగరంలో మెట్రో ఫేజ్-2 పనులను మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అమీర్పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రయల్ రన్లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి ప్రయాణించారు. మెట్రో ఫేజ్-2 త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని చెప్పారు. నాంపల్లి రైల్వేస్టేషన్,ఎంజీబీఎస్ను మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు.నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు.500 ల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. మియాపూర్ స్టేషన్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చెన్నై,బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. ప్రతి రోజు హైదరాబాద్ మెట్రోలో 80వేల మంది ప్రయాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.