
ఉపాధ్యాయుల బదిలీలు కోసం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్పై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుడు ప్రచారం నమ్మవద్దని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వేల మంది ఉపాధ్యాయుల తాకిడితో సర్వర్ డౌన్ అయిందని మంత్రి కడియం వివరణ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.ఉపాధ్యాయ బదిలీల కోసం వెబ్కౌన్సెలింగ్ ద్వారా ప్రక్రియ చేపట్టామని తెలిపారు. బదిలీల కోసం 75,318 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు, సీనియారిటీ జాబితాలు కూడా ప్రకటించామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకే షెడ్యూల్ సవరణ చేశామని స్పష్టం చేశారు. వివిధ అంశాల ఆధారంగా కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ నెల 26న వచ్చే న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా తదుపరి ప్రక్రియ చేపడుతామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.2,193 మందిలో 2,181మంది ప్రధానోపాధ్యాయులు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. 31,960మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ దరఖాస్తు చేసుకున్నారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్ల ఐచ్ఛికాల నమోదుకు రేపటి వరకు అవకాశం ఉందన్నారు. ఎస్జీటీలకు కూడా ఒక రోజు అవకాశాన్ని పొడిగిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా తప్పులు దొర్లినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే వెంటనే సరిదిద్దుతున్నామని తెలిపారు.
వెబ్కౌన్సెలింగ్ను మొదట అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాలు.. ఇప్పుడు వద్దంటున్నాయని గుర్తు చేశారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దంటూ తనకు సందేశాలు, ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ ఉండాలని కొంతమంది టీచర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. సాంకేతిక ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రక్రియలో ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా సరిచేస్తాం. తప్పుడు ధృవపత్రాలు ఇచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పెత్తనం పోతుందన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారానికి తెరలేపారని కడియం శ్రీహరి మండిపడ్డారు.