YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!..

బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!..

-  జీఎస్‌టీ అమల్లోకి తెచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ఇదే.

2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమల్లోకి తెచ్చిన తర్వాత వస్తున్న మొదటి బడ్జెట్ కూడా ఇదే.

ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం, దీనిపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి. బడ్జెట్‌ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవడంలో దోహదపడే పది ప్రాథమిక అంశాలు ఇవీ...

1. ఆర్థిక సంవత్సరం: భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ సంవత్సరానికి (జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు) మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇప్పటికీ ఇది ప్రతిపాదన దశలోనే ఉంది.

2. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి:ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వ్యక్తిగత వార్షికాదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది. మినహాయింపు పరిమితిని ప్రభుత్వం ఈసారి గణనీయంగా పెంచుతుందనే ప్రచారం సాగుతోంది.

3. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు: పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో గత ఏడాది ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణలు.

4. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను: షేర్లు కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను స్వల్ప కాలిక మూలధన లాభాలు అంటారు. వీటిపై ప్రస్తుతం పన్ను 15 శాతంగా ఉంది. ఏడాది కన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు. వీటిపై ప్రస్తుతం పన్ను లేదు. షేర్లపై లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి, వాటిపై పన్ను విధించకుండా ఉండాలంటే ఇకపై ఏడాది కాలాన్ని కాకుండా అంతకన్నా ఎక్కువ వ్యవధిని లెక్కలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందనే ప్రచారం ఉంది.

5. జీడీపీ- స్థూల దేశీయోత్పత్తి: ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.

6. ద్రవ్య లోటు:  ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.2 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని అందుకుంటామని నిరుడు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యం 3.5 శాతంగా ఉంది.

7. కరెంటు ఖాతా లోటు: వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.

8. పెట్టుబడుల ఉపసంహరణ: ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని 'పెట్టబడుల ఉపసంహరణ' అంటారు.

9. ఆర్థిక బిల్లు: కొత్త పన్నులను, ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు.

10. రెపో రేటు: ఆర్‌బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.

Related Posts