YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహాజాతరలో తొలి అంకం ఆవిష్కృతమైంది.

మహాజాతరలో తొలి అంకం ఆవిష్కృతమైంది.

- జంపన్న వాగుపై ఆసీనుడైన జంపన్న
- భక్తుల పబ్బతులతో హోరెత్తిన అడవి
- వనమంతా జన ప్రవాహమే...

మేడారం మహాజాతరలో తొలి అంకం ఆవిష్కృతమైంది. రెండు సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. ఆదివాసీల ఆరాధ్య దైవాలై న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం అనేక ప్రాంతాల నుండి బయలుదేరి  మేడారం చేరుకుని చల్లని తల్లుల కరుణా కటాక్షాలకై వేచి చూస్తున్న కోట్లాది భక్తుల ఎదురు చూపులు ఫలించాయి. కన్నెపల్లి సారలమ్మ తల్లి మేడారానికి తరలివచ్చింది. తల్లిరాకతో భక్తజనకోటి పూనకాలతో పులకించిపోయారు. వారి పిలుపులు, మొక్కులతో మేడారమంతా మార్మోగిపోయింది.నీటి అలలతో ఓలలాడే జంపన్న వాగు జనసంద్రమైంది. చల్లని తల్లి కాలు మోపగానే మేడారం నేల పునీతమైంది. కన్నెపల్లి వాసులు తల్లికి హారతులిస్తూ, నీళ్లతో ఆరగిస్తు మేడారానికి సాగనంపగా, నాలుగు కిలోమీటర్ల్ల దారిపొడుగునా భక్తుల పబ్బతులు అందుకుంటూ దారిలో జంపన్న తీరంలో కొలువైన సోదరుడు జంపన్నను మందలించుకుంటూ వరాల తల్లి గద్దె నెక్కింది. తల్లి రాకకు ముందే పూనగుండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి  గోవిందరాజులు వారివారి గద్దెలపైకి చేరుకున్నారు. మరోపక్క తన బిడ్డలు.. భక్తజనకోటి కోసం మేడారం రావటానికి మహాతల్లి సమ్మక్క చిలకలగుట్టైపై నుండి బయులుదేరింది. ఆ  మహాద్బుత ఘట్టం కోసం భక్తజనకోటి ఉద్విగ్న భరిత మైంది. 
బుదవారం నాడు గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువు తీరగా, జంపన్న తీరంలో జంపన్న కొలువు తీరి భక్తజనకోటికి దీవెనలు, వరాలిస్తున్నారు.ఆదివాసీ గిరిజన కోయలు బుధవారం ఉదయం నుండి  తమ ఆచార సాంప్ర దాయాల ప్రకారం రోజంతా పూజలు నిర్వహించారు. కన్నె పల్లి ఆడబిడ్డలు సారలమ్మ ఆల యంలో ప్రత్యేక పూజలు చేసి శుద్ది చేసే సామాగ్రి, మంచి నీటితో మేడారానికి బయలు దేరి వచ్చి మేడారం సారలమ్మ గద్దెను శుద్ది చేసి పట్టు పరిచారు. సాయంత్రం సారలమ్మ గుడివద్ద ప్రధాన పూజారులు  ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రతిరూపమైన  బండారి ( పసుపు ) కుంకుమలను వెదురుబుట్టలో  తీసుకుని సారలమ్మ ప్రదాన పూజారి కాక సారయ్య సాయంత్రం 8 గంటల 10  నిమిషాలకు బయలు దేరి జంపన్న వాగు మీదుగా పవనసుత హనుమాన్ జెండానీడలో  పటిష్ట బందోబస్తు నడుమ పోలీసులు , ఆదివాసీ వాలంటీర్లు  తదితరులు వెంటరాగా,  పూజారులు కాక కిరణ్, కాక శ్యాం, గ్రామపెద్దలు  సారలమ్మను మేడారానికి చేర్చారు.

 కన్నెపల్లి నుండి సారలమ్మ తల్లి జంపన్న వాగు వద్దకు రాగానే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనకోటి ఉప్పొంగిన భక్తిపారవశ్యంలో  ‘సారలమ్మ తల్లీ దండాలు’ అంటూ హోరెత్తించారు. తల్లి నడిచివచ్చేనీటిలో స్నానాల కోసం పోటీలు పడ్డారు. సాయంత్రం సుమారు 10 గంటల ప్రాంతంలో పూజారులు సారలమ్మతో  పాటు పడిగిద్దరాజు, గోవిందరాజులను  గద్దెలపై కొలువుంచారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అధికారులు హాజరయ్యారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను కొలువుంచే సమయాల్లో దర్శనాలను  నిలిపివేశారు. సారలమ్మ గద్దెపైకి చేరిన ఘట్టానికి గుర్తుగా ఆదివాసి పూజారులు కొమ్ము బూరలు ఊదారు.  అమ్మవారి రాక అద్బుత సన్నివేశాన్ని కనులారా తిలకించేందుకు కన్నెపల్లి నుండి మేడారం దారి పొడవునా భక్తజనకోటి అమ్మోరికి ఎదురేగి దండాలు పెట్టారు. ఎదురుకోళ్లు అందించారు. కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించారు.సారలమ్మను తీసుకుని వచ్చే ప్రధాన పూజారి తమపైనుండి నడుచుకుంటూ పోతే కోరికలు తీరుతాయనీ,  తమ జన్మసుకృతం అవుతుందన్న నమ్మకంతో దారిపొడువుగా భక్తులు వరాలు పట్టారు. పూజారులు వీరిపైనుండి నడుచుకుంటూ గద్దెలైవెపు సాగారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల, .భక్తజనకోటి హోరు, హిజ్రాలు, జోగమ్మల శివాలుతో సారలమ్మ ఆలయం భక్తిపారవశ్యమైంది. మహాజాతర పరిసర ప్రాంతాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడాయి.  వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తుల ప్రవాహంతో వనాల్లోని బాటలన్నీ నిండిపోయాయి.  దాదాపు 20 కిలో మీటర్ల వరకు  అడవి దారులన్నీ కిక్కిరిసిపోయాయి.

 
నేడు వేంచేయునున్న సమ్మక్క...
జాతరలో రెండో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి ఆగమనం. మేడారానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చిలకలగుట్టపై వెలసి ఉన్న  సమ్మక్క తల్లిని  గురువారంమేడారానికి తీసుకువచ్చారు.  వనదేవతల జాతరలో ఈ ప్రధాన ఘట్టం కోసం భక్తజనకోటి కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసింది.

ప్రధాన పూజారి అలక
సారలమ్మను గద్దెకు తీసుకవచ్చే క్రమంలో మేడారం జాతర ప్రధాన పూజారైన సారయ్య తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని దేవతను తీసుకురావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయతించడంతో జాతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎస్పీ దక్షిణామూర్తి సారయ్యను బుజ్జగించి లోపలికి తీసుకెళ్లాడు. సరైన ప్రాధాన్యత కల్పిస్తామని నచ్చజెప్పడంతో సారయ్య శాంతించి పూజలో పాల్గొన్నారు.

Related Posts