
ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించిన తర్వాత కేరళలో ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గతంలో రెండుసార్లు అయ్యప్ప ఆలయం తెరుచుకోగా నిషేధిత వయసు మహిళలు శబరిమల వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మండల, మకర విలక్కు పూజల కోసం గతవారం ఆలయాన్ని తెరవగా మరోసారి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకుంది. దాదాపు 15 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను కేరళ సర్కారు ఏర్పాటుచేసింది. అలాగే రాత్రి సమయంలో భక్తులెవరూ సన్నిధానంలో ఉండరాదని ఆదేశాలు జారీచేయడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ యువజంట శబరిమల వెళ్లేందుకు వస్తున్నారనే వార్తలతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆ జంట ఎరుమేళి వద్ద ఉన్నారని, శబరిమలకు రానున్నారని ప్రచారం జరగడంతో సన్నిధానం వద్ద భక్తులు నిరసన చేపట్టారు. బ్యానర్లు ప్రదర్శించిన భక్తులు తమ శరణుఘోషలతో శబరిగిరులను హోరెత్తించారు. అయితే, తమకు శబరిమల వెళ్లే ఆలోచన లేదని విజయవాడకు చెందిన ఆ జంట వెల్లడించడంతో పరిస్థితి సద్దుమణిగిందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఆ యువజంట కేరళలోని వివిధ ప్రదేశాలను చూసేందుకు మాత్రమే వచ్చినట్టు తెలిపారు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో ఎరుమేళి వద్దకు వీరు చేరుకోగానే మహిళలతో సహా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు అక్కడ గుమిగూడారు. వారు ప్రయాణిస్తోన్న బస్సు స్టేషన్కు చేరుకోగానే భక్తులు తమ నిరసన ప్రారంభించారు. శబరియాత్రలో ఎరుమేళి ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ మసీదులోని వావరుస్వామికి మొక్కు చెల్లించిన తర్వాతే శబరిమలకు వెళ్తారు. పేటాతూళ్లు ఆడుతూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇది ముగిసిన అనంతరం, అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి తాము చెంగనూరు వెళ్తామని, వివిధ ఆలయాలను దర్శించుకునే ఉద్దేశంతో వచ్చాం తప్పా, శబరిమల వెళ్లబోమని ఆ దంపతులు తెలియజేయడంతో భక్తులు శాంతించారు.