
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గత డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహించామని, అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తెలిపారు. సోమవారం డిల్లీ నుండి భారత ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ ఆరోరా వివిధ రాష్ట్రాల సి.యస్ లు, డిజిపి, సిఈఓలు, I.T ఇతర అధికారులతో పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతపై వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, సిఈఓ రజత్ కుమార్, ముఖ్యకార్యదర్శులు సోమేష్ కుమార్, రాజీవ్ త్రివేది, అడిషనల్ డిజి జితేందర్, ఎన్నికల అధికారులు ఆమ్రపాలి, సత్యవాణి, ఐటి అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ స్టేషన్ లో అన్ని వసతులు కల్పిస్తామని సి.యస్ అన్నారు. వికలాంగులకు పోలింగ్ స్టేషన్ల లో వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రధమ అవార్డు పొందిందని భారత ఎన్నికల సంఘం అధికారులకు సి.యస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు త్వరలోనే రాష్ట్రాలను పర్యటిస్తారని సి.యస్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబాతను ను ఫిబ్రవరి 22 న పబ్లిష్ చేస్తామన్నారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో వచ్చే నెల 5 న సమావేశం జరుగనున్నదని సి.యస్ కేంద్ర ఎన్నికల అధికారులకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు.
రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించామని, పంచాయతీ ఎన్నికలు 2 దశలు పూర్తయ్యాయని, మూడవ దశ ఈ నెల 30 న జరుగనున్నదని, పార్లమెంటు ఎన్నికలను కూడ ఎటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నక్సల్స్ ప్రభావంపై చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో ప్రత్యేక దృష్టితో కార్యచరణప్రణాళికను అమలు చేస్తామన్నారు. అంతరాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు, గత ఎన్నికల కేసుల పరిష్కారానికి చర్యలు, సమాచార మార్పిడి తదితర అంశాలపై వారికి వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వారికి తెలిపారు. శాసన సభ ఎన్నికలకు పొరుగు రాష్ట్రాలనుండి 19 వేల మంది, కేంద్రం నుండి 276 కంపెనీల పోలీసు సిబ్భందిని కేటాయించారని, అదే స్ధాయిలో పార్లమెంటు ఎన్నికలకు కేటాయించాలన్నారు. గత ఎన్నికల సందర్భంగా 97 కోట్లు సీజ్ చేశామని, కేసులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి చేయవలసిన ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ధన, మద్యం ప్రభావాన్ని నిరోధించడానికి తగు చర్యలు చేపడతామన్నారు.
సి.ఈ.ఓ రజత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘంలో అవసరమైన సిబ్బంది, ఆర్వోలు, ఏఆర్వోలు ఉన్నారని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1950 అన్ని జిల్లాలలో ప్రారంభించామని, సిబ్బందికి శిక్షణ పూర్తయిందని వారికి తెలిపారు. ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, 16 లక్షల క్లెయిమ్లు, అభ్యంతరాలు వచ్చాయని, పంచాయతీ ఎన్నికలు ఉన్నందున గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించారని తెలిపారు. శాసన సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ఎన్నికల నిర్వహణ సిబ్భందికి శిక్షణనిస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలలో దివ్యాంగులకు చేసిన ఏర్పాట్లకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డ్ వచ్చిందని, మన రాష్ట్రం దివ్యాంగుల ఓటింగ్ విషయం లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇటీవల శాసన సభ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు నిర్వహించామని అన్నారు.